కోల్కతా : టీఎంసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన నిరసన ప్రదర్శనలో హింస చెలరేగడం పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. రాష్ట్రంలో హింసాకాండ చెలరేగేలా కాషాయ పార్టీ ఇతర రాష్ట్రాల నుంచి బాంబులు, గన్లతో అల్లరి మూకలను రప్పించిందని ఆమె ఆరోపించారు.
బీజేపీ ర్యాలీ సందర్భంగా మంగళవారం కోల్కతా, హౌరాలో జరిగిన హింసను ప్రస్తావిస్తూ కాషాయ కార్యకర్తలు రెచ్చగొట్టినా పోలీసులు లాఠీచార్జి, ఫైరింగ్కు దిగకుండా సంయమనంతో వ్యవహరించారని దీద పేర్కొన్నారు. నిన్న బీజేపీ కార్యకర్తలు హింసకు దిగడంతో పలువురు పోలీసులు గాయపడ్డారని రాజకీయాల్లో సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం వాంఛనీయం కాదని అన్నారు. పోలీసులపై దాడి, ఘర్షణలకు పాల్పడిన ఘటనలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.
నిరసనల పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి బాంబులు, తుపాకులతో గూండాలను రప్పించారని ఆమె ఆరోపించారు. శాంతియుత నిరసనలతో ఇబ్బంది లేదని, గూండాగిరిని మాత్రం సహించేది లేదని దీదీ హెచ్చరించారు. బెంగాల్ సెక్రటేరియట్కు వెళ్లేందుకు అడ్డుగా నిర్మించిన బారికేడ్లను తొలగించేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు నిలువరించారు. దీంతో కోల్కతా, హౌరా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పరిస్ధితి రణరంగాన్ని తలపించింది.