Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా మమతా బెనర్జీ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది. టీఎంసీ ఆధ్వర్యంలోని మమత ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో రూ.4.06 లక్షల కోట్ల అంచనాతో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి చంద్రిమ భట్టాచార్య బడ్జెట్ వివరాల్ని సభలో అందించారు.
ఈ బడ్జెట్లో యువత, మహిళల్ని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. బంగ్లార్ యువ సతి అనే స్కీం ద్వారా 21-40 లోపు నిరుద్యోగులకు నెలనెలా రూ.1,500 అందించనున్నారు. ఇప్పటికే అమలవుతున్న లక్ష్మీ భండార్ స్కీం ద్వారా మహిళలకు ఇకపై రూ.1,500 ఇస్తారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా వెయ్యి రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లకు నెలనెలా రూ.1,000 అలవెన్స్ పెంచారు. అంగన్వాడీల కుటుంబ సభ్యులకు ఐదు లక్షల ప్రమాద బీమా అందిస్తారు. సివిక్ వాలంటీర్లకు, గ్రీన్ పోలీస్ పర్సనల్స్కు అందించే వేతనాన్ని కూడా వెయ్యి రూపాయలు పెంచారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంచారు.
బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. తమది మహిళలు, యువతకు మేలు చేసే బడ్జెట్ అన్నారు. కేంద్ర బడ్జెట్లాగా దశా, దిశానిర్దేశం లేని బడ్జెట్ కాదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తమ ప్రాధాన్యమన్నారు. ఇది ప్రజల బడ్జెట్ అని, ఎలాంటి గిమ్మిక్కులు లేవని వ్యాఖ్యానించారు. వేతనాల పెంపు, డీఏ పెంపు వంటివి తక్షణమే అమల్లోకి వస్తాయన్నారు.