Kolkata Incident : దేశవ్యాప్తంగా మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడులు ఆందోళన రేకెత్తిస్తున్నాయని, వీటి నియంత్రణకు కఠిన చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటన కలకలం రేపిన క్రమంలో ప్రధాని మోదీకి దీదీ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
దేశవ్యాప్తంగా రోజూ దాదాపు 90 లైంగిక దాడుల కేసులు నమోదవడం భయోత్పాతం కలిగిస్తోందని ప్రధానికి రాసిన లేఖలో మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం ముఖ్య సలహాదారు అలపన్ బందోపాధ్యాయ్ గురువారం వెల్లడించారు. దేశవ్యాప్తంగా మహిళలపై పెరుగుతున్న అరాచకాలు సమాజంలో విశ్వాసాన్ని, మనస్సాక్షిని ప్రభావితం చేస్తున్నాయని ఈ లేఖలో ఆమె పేర్కొన్నారు. మహిళలు భద్రతతో విశ్వాసంతో జీవించేలా చూసేందుకు ఈ అరాచకాలకు చరమగీతం పాడేందుకు పూనుకోవడం మన కర్తవ్యమని దీదీ లేఖలో ప్రస్తావించారు.
అత్యంత హేయమైన ఈ తరహా నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కేంద్ర చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. సత్వర న్యాయం జరిగేలా తక్షణమే ఈ కేసులను త్వరితగతిన విచారణ చేపట్టేందుకు ఫాస్ట్ట్రాక్ ప్రత్యేక న్యాయస్ధానాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఇలాంటి కేసుల్లో 15 రోజుల్లోనే విచారణ ముగిసేలా చూడాలని ఆమె ప్రధానికి రాసిన లేఖలో అభ్యర్ధించారు.
Read More :
Hyderabad | రాత్రిపూట మహిళలకు ఉచిత రవాణా.. హైదరాబాద్ పోలీసుల వివరణ ఇదీ..!