Mamata Banerjee : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ ఓటర్లను ఆకట్టుకునేందుకు సీఎం మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు మరో ఉచిత పథకానికి శ్రీకారం చుట్టారు. పదో తరగతి పాసైన నిరుద్యోగ యువతకు నెలకు రూ.1,500 ఇస్తామని ప్రకటించారు. మార్చి 7, శనివారం నుంచే ‘యువ సతి’ పేరుతో ఈ పథకం ప్రారంభమవుతుందని వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో మమతా బెనర్జీ ఈ ప్రకటన చేశారు.
నిజానికి ఈ పథకం ఏప్రిల్ నుంచి ప్రారంభం కావాలని, కానీ, ఈ రోజు నుంచే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ప్రకారం పదో తరగతి పాసైన 21-40 ఏళ్ల మధ్య గల యువతీ యువకులకు ప్రతి నెలా నిరుద్యోగ భృతి కింద ప్రతి నెలా రూ.1,500 ప్రభుత్వం నుంచి అందుతాయి. ఈ రోజు నుంచే ఈ పథకం ప్రారంభమవుతుంది. అయితే, నిరుద్యోగులకే కాకుండా ఇతర చదువులు చదువుతున్న వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. అంటే ఉద్యోగం, వేతనాలు లేకుంటే చాలు ఈ పథకాన్ని పొందవచ్చు. అలాగని ఇతర ఆర్థిక లబ్ధి చేకూర్చే ప్రభుత్వ పథకాలు పొందకూడదు. స్కాలర్షిప్లకు మాత్రం మినహాయింపు ఉంటుంది. పంజాబ్లో 21-40 ఏళ్ల మధ్య గలవారు కోటి మంది వరకు ఉన్నారు. వీరంతా యువ సతి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, వీరిలోంచి నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారుల్ని ఎంపిక చేసి నగదు అందజేస్తారు.
కాగా.. తమ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు ప్రయత్నిస్తోందని మమతా బెనర్జీ అన్నారు. తన పాలనలో నిరుద్యోగం 40 శాతం తగ్గిందని, 40 లక్షల మంది నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చామన్నారు. అందులో 10 లక్షల మంది ఇప్పటికే ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. బెంగాల్లో వలస కార్మికులకు కూడా ప్రభుత్వం శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పిస్తుందన్నారు. రైతులకు కూడా ఆర్థిక సాయం అందిస్తున్నామని, భూమి లేని వారికి కూడా ఆర్థికంగా చేయూతనిస్తున్నామని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల చివర లేదా వచ్చే నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.