Southwest Monsoon : ఇంతకాలం మండుటెండల (Heat waves) తో అల్లాడిపోతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా చల్లని కబురు వచ్చేసింది. కేరళ (Kerala) కి నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ప్రవేశించాయి. దాంతో కేరళ తీర ప్రాంతాల్లో (Coastal Areas) భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. మరో వారంలోపే ఈ రుతుపవనాలు తెలంగాణ (Telangana) లోకి ప్రవేశించే అవకాశం ఉంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి నైరుతి రుతుపవనాలు కొంత ఆలస్యంగా వచ్చాయి.
వాస్తవానికి మే 26వ తేదీననే నైరుతి రుతపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ముందుగా అంచనా వేసింది. కానీ, ఎల్నినో ప్రభావంతో ఆ అంచనాలు తలకిందులయ్యాయి. కాగా రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలప్పుళ, కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో అటు తమిళనాడులోని 15 జిల్లాల్లోనూ రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిక జారీచేసింది.
ఇదిలావుంటే.. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది నైరుతి రుతుపవన కాలంలో (జూన్-సెప్టెంబర్) సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని వాతావరణ విభాగం అంచనా వేసింది. దీర్ఘకాల సగటుతో పోలిస్తే 90% వర్షమే ఈ సీజన్లో కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నది. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఎల్నినో పరిస్థితులు ఆవిర్భవిస్తున్నాయని, జూన్లో ఇవి బలహీనంగా ఉన్నా సెప్టెంబర్లో మాత్రం బలంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.