Farmers Protest : రైతులతో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరిపి వారి డిమాండ్లకు పరిష్కారం చూపాలని పంజాబ్ కిసాన్ మజ్ధూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి శర్వన్ సింగ్ పాంథర్ కోరారు. ప్రధాని మోదీ నేరుగా రైతు నేతలతో సంప్రదింపులు జరపాలని తాము గతంలోనూ కోరామని స్పష్టం చేశారు.
తాము శాంతియుతంగా ప్రదర్శన చేపడతామని, బారికేడ్లు పగులకొడతామని తాము చెప్పడం లేదని అన్నారు. ఈరోజు కేంద్ర మంత్రులతో సమావేశం ఉందని, అయితే తాము స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ రైతులతో మాట్లాడి సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతున్నామని చెప్పారు. ఇలా జరిగితే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని అన్నారు. మనది ప్రజాస్వామ్య దేశమని, ఢిల్లీలో ప్రశాంతంగా తమ ఉద్యమం చేపట్టేలా అనుమతించాలని కోరారు.
ఇక గురువారం సాయంత్రం కేంద్ర మంత్రులతో రైతు సంఘాల నేతలు చర్చలు జరపనున్నారు. తమ పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చేలా చట్టబద్ధత కల్పించడంతో పాటు ఇతర ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని రైతులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. రైతుల ఛలో ఢిల్లీ పిలుపుతో దేశ రాజధాని సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతులను ఢిల్లీలోకి అడుగుపెట్టకుండా ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
Read More :