న్యూఢిల్లీ: కర్ణాటకలో సాధ్యమైనంత త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ రణ్దీప్ సుర్జేవాలా చెప్పారు. సీఎంగా ఎవరి పేరును ఖరారు చేయాలనే దానిపై కాంగ్రెస్ హైకమాండ్ ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల పరిశీలకుల కమిటీ చర్చలు జరుపుతున్నదని ఆయన అన్నారు. పరిశీలకుల కమిటీ కొత్తగా ఎన్నికైన ఒక్కో ఎమ్మెల్యేతో విడివిడిగా మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకుంటున్నదని చెప్పారు.
త్వరలోనే అందరి అభిప్రాయాలను తెలుసుకుని ఇవాళ రాత్రికల్లా పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు నివేదిక అందజేస్తుందని సుర్జేవాలా వెల్లడించారు. మల్లికార్జున్ ఖర్గే ఆ నివేదికను పరిశీలించి సీఎం ఎవరనేది ఖరారు చేస్తారన్నారు. సీఎం కాబోయేది ఎవరో సాధ్యమైనంత త్వరగా నిర్ణయించి కర్ణాటకలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 224 స్థానాలకుగాను 135 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. అయితే సీఎం పదవి కోసం సీనియర్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ పోటీపడుతుండటంతో వారిలో ఒకరి పేరును ఖరారు చేయడం కాంగ్రెస్ పార్టీకి కత్తిమీద సాములా మారింది. ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ కేంద్ర మాజీ హోంమంత్రి సుశీల్కుమార్ షిండే నేతృత్వంలో ముగ్గురు సభ్యుల పరిశీలకుల కమిటీని ఏర్పాటు చేసింది.
#WATCH | “The observers will submit their report to party president Mallikarjun Kharge by tonight. We will soon form the government in Karnataka,” says Congress MP Randeep Singh Surjewala, in Delhi pic.twitter.com/oZWfyuajoV
— ANI (@ANI) May 15, 2023