చెన్నై: శ్వాససంబంధ అనారోగ్యంతో గురువారం ఉదయం కన్నుమూసిన ప్రముఖ నటుడు, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు కెప్టెన్ విజయకాంత్ (Vijayakanth) ను కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులేగాక ఆయన అభిమానులు, పార్టీ శ్రేణుల తండోపతండాలుగా తరలివస్తున్నారు. ప్రస్తుతం విజయకాంత్ పార్థివదేహాన్ని తమిళనాడు రాజధాని చెన్నైలోని కోయంబేడు ఏరియాలోగల (DMDK) డీఎండీకే ప్రధాన కార్యాలయంలో ఉంచడంతో అక్కడ భారీ జనసందోహం నెలకొంది.
డీఎండీకే పార్టీ కార్యాలయం లోపల, బయట, రోడ్లపైన, ఫ్లైవోవర్ల మీద జనం కిక్కిరిసిపోయారు. ఈ జనసందోహాన్ని డ్రోన్ కెమెరాల ద్వారా బంధించిన దృశ్యాలను మీరు ఈ కింది వీడియోల్లో చూడవచ్చు.
#WATCH | Chennai: A large number of people gathered to pay the last tributes to DMDK chief Captain Vijayakanth, who passed away earlier today.
(Drone visuals) pic.twitter.com/53rJJNo4vV
— ANI (@ANI) December 28, 2023
కాగా, శ్వాస సంబంధ సమస్యతో చెన్నైలోని మియోట్ దవాఖానలో చేరిన విజయకాంత్కు వైద్య పరీక్షల్లో కొవిడ్ నిర్ధారణ అయ్యింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్ పెట్టి చికిత్స అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది.
71 ఏండ్ల విజయకాంత్ ఏడాది కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గత నెల 18న కూడా జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో మియోట్ దవాఖానలో చేరారు. చికిత్స అనంతరం కోలుకుని డిసెంబర్ 11న ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత రెండు వారాలైనా గడువకముందే ఆయన కొవిడ్ బారినపడటం, మరోసారి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో ఇవాళ మృతిచెందారు.