(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ప్రధానిగా నరేంద్రమోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన మిత్రుడు, అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆక్టోపస్లా విస్తరించారు. ఇదే అంశంపై ప్రఖ్యాత అమెరికన్ పత్రిక ‘వాషింగ్టన్ పోస్ట్’ పరిశోధనాత్మక కథనాన్ని వెలువరించింది. ‘తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత’ అంటూ ఓ సినిమాలో హీరో డైలాగ్ చెప్పినట్టు ఓ కీలక ఉదంతాన్ని ఉటంకిస్తూ.. అదానీకి లబ్ధి చేకూర్చడానికి మోదీ దౌత్య సంబంధాలను ఎలా తాకట్టుపెట్టారో సాక్ష్యాలతో సహా బయటపెట్టింది. వెలుగులోకి రానివి ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నట్టు వెల్లడించింది.
ఎక్కువ రేటుకు కొనండి
‘హమ్ దో (మోదీ, అమిత్ షా).. హమారే దో (అదానీ, అంబానీ)’ అన్న మాటలు అక్షర సత్యాలుగా మారాయి. ముఖ్యంగా అదానీ గ్రూప్నకు లబ్ధి చేకూర్చేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎప్పుడూ తహతహలాడుతూ ఉంటుంది. గత ఎనిమిదిన్నరేండ్లలో బీజేపీ సర్కారు సాయంతో పోర్టులు, ఎయిర్పోర్టులు, రైల్వే, సిమెంటు, బొగ్గు, విద్యుత్తు, రవాణా, గ్యాస్, రిటైల్, మీడియా ఇలా కీలక రంగాల్లో అదానీ గ్రూప్ పాతుకుపోవడమే ఇందుకు సాక్ష్యం. అదానీకి లబ్ధి చేకూర్చేందుకు ప్రధాని మోదీ దౌత్య సంబంధాలను కూడా తాకట్టు పెట్టారని ‘వాషింగ్టన్ పోస్ట్’ ప్రత్యేక కథనంలో వెలువరించింది.
ఈ మేరకు జార్ఖండ్లోని గొడ్డాలో ఏర్పాటైన అదానీ పవర్ ప్లాంట్ను ఉటంకించింది. 2015 జూన్లో ప్రధాని మోదీ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లారు. దౌత్య, వాణిజ్య సంబంధాల బలోపేతంలో భాగంగా ఆ దేశంతో 4.5 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. బంగ్లాలో పరిశ్రమలు స్థాపించి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని ప్రధాని షేక్ హసీనాకు హామీనిచ్చారు. అయితే, గొడ్డాలో నిర్మించనున్న అదానీ పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్తును కొనుగోలు చేయాలని, అదానీకి చెందిన విద్యుదుత్పత్తి, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను బంగ్లాలో స్థాపించేందుకు అనుమతినివ్వాలని మెలిక పెట్టారు.
దీంతో డిమాండ్ కంటే 40 శాతం అదనంగా విద్యుత్తు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నా, 25 ఏండ్ల పాటు కొనసాగే ఈ డీల్కు హసీనా తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకొన్నారు. మార్కెట్ రేటు కంటే దాదాపు 35 శాతం ఎక్కువ పెట్టి కరెంటును కొనుగోలు చేయడానికి అంగీకరించారు. ఆ వెంటనే స్వదేశానికి వచ్చిన ప్రధాని హడావిడిగా గొడ్డా అదానీ పవర్ ప్లాంట్కు అనుమతులు మంజూరుచేయడమే కాకుండా శంకుస్థాపన కూడా చేశారు. గొడ్డా ప్లాంట్లో విద్యుదుత్పత్తి జరుగుతున్నప్పటికీ, ట్రాన్స్మిషన్ లైన్స్ ఏర్పాటు పూర్తికాకపోవడంతో బంగ్లాకు విద్యుత్తు సరఫరా జరగటం లేదు.
అయినప్పటికీ, ఒప్పందం ప్రకారం.. ఆ ప్రభుత్వం ఏడాదికి 450 మిలియన్ డాలర్లను అదానీ గ్రూప్నకు చెల్లిస్తున్నది. ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని, దౌత్యసంబంధాలను అడ్డుపెట్టుకొని బీజేపీ సర్కారు అదానీ గ్రూప్నకు ఇలాంటి లాభదాయక ఒప్పందాలు ఎన్నో కుదిర్చినట్టు పత్రిక వెల్లడించింది. అదానీకి విద్యుత్తు ప్రాజెక్టు అప్పగించడం కోసం శ్రీలంక ప్రభుత్వంపై మోదీ ఒత్తిడి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
డీల్స్ కోసమే పర్యటనలు!
అదానీ గ్రూప్నకు లబ్ధి చేకూర్చడానికే ప్రధాని మోదీ కొన్ని దేశాల్లో ప్రత్యేకంగా పర్యటించినట్టు అర్థమవుతున్నది. 2014 నవంబర్లో మోదీ ఆస్ట్రేలియాలో పర్యటించిన అనంతరం.. అక్కడి ప్రభుత్వం అదానీ గ్రూప్నకు భారీ రైల్వే, మౌలిక వసతుల కాంట్రాక్టులు కట్టబెట్టింది. 2015 ఏప్రిల్లో ప్రధాని ఫ్రాన్స్ పర్యటన జరగ్గా.. అదానీ గ్రూప్తో రాఫెల్ కంపెనీ ఓ ఒప్పందం చేసుకొన్నది. అదే ఏడాది నవంబర్లో మలేషియాలో మోదీ పర్యటించిన అనంతరం 2017లో అదానీ గ్రూప్నకు ఆ ప్రభుత్వం ఐలాండ్ పోర్టు కట్టబెట్టింది. 2016 ఫిబ్రవరిలో స్వీడన్, మార్చిలో ఇజ్రాయెల్, జూన్లో అమెరికా, జూలైలో మొజాంబిక్, నవంబర్లో జపాన్లో మోదీ పర్యటించగా.. అదానీ గ్రూప్తో ఆయా ప్రభుత్వాలు ఆగమేఘాలపై పలు ఒప్పందాలు కుదుర్చుకొన్నాయి. 2017 నుంచి 2022 వరకు మరో 30కి పైగా దేశాలు అదానీ గ్రూప్నకు ప్రాజెక్టులు కట్టబెట్టినట్టు, ఆయా దేశాల్లో ప్రధాని పర్యటించినట్టు పరిశీలకులు చెప్తున్నారు.