న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా అభ్యర్థులు ఎవరికైనా ఫలితాలపై అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఎన్నికల కమిషన్ తాజాగా నిర్ణయించింది. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన 7 రోజుల వరకు ఈవీఎంలో నమోదైన ఓట్లతో వీవీప్యాట్లను సరిచూసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. అభ్యర్థులు తగిన రుసుము చెల్లించి వీవీప్యాట్తో ఈవీఎంలో నమోదైన ఓట్లను సరిచూసుకోవచ్చని ఆయన చెప్పారు.
శుక్రవారం చెన్నైలో విలేకరుల సమావేశంలో సీఈసీ మాట్లాడుతూ కొత్తగా తీసుకున్న నిర్ణయాల్లో మరో ప్రధాన నిర్ణయం ఈవీఎం కౌంటింగ్ ప్రారంభం కావడానికి 2 రౌండ్ల ముందు పోస్టల్ బ్యాలట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. తమిళనాడులో ఇటీవల ముగిసిన సర్ ప్రక్రియ విజయవంతమైందని, ఇది దేశానికే ఆదర్శమని సీఈసీ చెప్పారు. ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని తమిళనాడులోని రాజకీయ పార్టీలు సూచించాయని, అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఎన్ని దశల్లో ఎన్నికలను ఈసీ నిర్వహిస్తుందో తెలుస్తుందని ఆయన వివరించారు. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఎటువంటి లోపాలు లేకుండా జరిగాయని, తమిళనాడు ఎన్నికలు అంతకన్నా మెరుగ్గా జరుగుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.