కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఇవాళ రెండు విడుత అసెంబ్లీ ఎన్నికలు(West Bengal Assembly Elections) జరుగుతున్నాయి. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ బూత్కు చేరుకున్నారు. మొత్తం 142 స్థానాలకు ఇవాళ తుది విడుత పోలింగ్ జరుగుతోంది. కొన్ని చోట్ల ఉదయమే విధ్వంసకర సంఘటనలు జరిగాయి. చాప్రా, శాంతిపుర్, భాంగర్లో స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఎంటలీ నియోజకవర్గంలో పోలింగ్ ఆఫీసర్లు, సెక్యూర్టీ సిబ్బందితో బీజేపీ అభ్యర్థి గొడవ పడ్డారు. పోలింగ్ బూత్ నుంచి తమ ప్రతినిధిని గెంటివేయడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బూత్ చిన్నగా ఉన్న కారణంగా ఏజెంట్ను బయటకు పంపినట్లు తెలుస్తోంది. ఓ సీటు కోసం తృణమూల్ అభ్యర్థి గొడవపడడంతో ఇద్దర్నీ పంపించేశారు.
నదియా జిల్లాలోని చాప్రాలో ఓ బీజేపీ ఏజెంట్పై అటాక్ జరిగింది. తృణమూల్ వర్కర్లు తనపై దాడి చేసినట్లు ఏజెంట్ మీర్ తెలిపాడు. ఈవీఎంలు మొరాయిస్తున్నట్లు కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. హౌరాలో ఓటింగ్ మెషీన్లు సరిగా పనిచేయడం లేదని కొందరు ఆరోపించారు. పారామిలిటరీ దళాలు ఓ వ్యక్తిని లాక్కెళ్తున్న దృశ్యాలు ఓ వీడియోకు చిక్కాయి. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది. మరో వ్యక్తిపై బలగాలు లాఠీ విసిరినట్లు కూడా తెలుస్తోంది. కొన్ని చోట్ల ప్రాపర్టీ డ్యామేజ్ జరిగింది. శాంతిపూర్లో బీజేపీ క్యాంపు కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. సౌత్ 24 పరగనాస్ జిల్లాలోని భాంగర్లో సెక్యూలర్ ఫ్రంట్కు చెందిన పోలింగ్ ఏజెంట్ను బూత్కు రానివ్వలేదు.
టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ.. భబానిపుర్లో ఉన్న మిత్ర ఇన్స్టిట్యూషన్లో ఓటేశారు. బీజేపీకి 50 కన్నా తక్కువ సీట్లు వచ్చేలా ప్రజలు ఓటేయాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 77 సీట్లు వచ్చాయి. ఈసారి కూడా బెంగాలీ ప్రజలు బీజేపీకి గట్టి షాకిస్తారన్నారు. భారీ సంఖ్యలో ప్రజలు ఓటింగ్లో పాల్గోవాలన్నారు. ఒకవేళ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధిస్తే, ప్రధాని మోదీ తన పదవికి రాజీనామా చేయాలని రాజ్యసభ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ సవాల్ చేశారు. బెంగాల్లో ఉన్న 294 సీట్లకు మీరు పోటీ చేస్తున్నారు, ఈ సవాల్ను స్వీకరించాలన్నారు.
భబానిపుర్లో ఉన్న పోలింగ్ బూత్లను మమతా బెనర్జీ విజిట్ చేశారు. కేంద్రం ఆదేశించినట్లు కేంద్ర బలగాలు వ్యవహరిస్తున్నాయని ఆమె ఆరోపించారు. వేరువేరు రాష్ట్రాల నుంచి అనేక మంది అబ్జర్వర్లు వచ్చారని, వాళ్లంతా బీజేపీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఓటింగ్ ఎలా జరుగుతుందని బెనర్జీ అన్నారు.