Loksabha Elections 2024 : జూన్ 9న ఒడిషా సీఎంగా భూమి పుత్రుడు ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేడీ నేత వీకే పాండ్యన్ పేర్కొన్నారు. ఒడియా భాష మాట్లాడటమే కాదు ఒడిషా ప్రజల గుండెల్లో కొలువుతీరిన వ్యక్తి జూన్ 9న ఈ భూమి పుత్రుడు రాష్ట్ర సీఎంగా కొలువుతీరుతారని చెప్పారు. బొగ్గు రాయితీ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును పాండ్యన్ తప్పుపట్టారు.
ఒడిషా నుంచి రూ. 60,000 కోట్లు తీసుకుంటున్న కేంద్రం కేవలం రూ. 4000-5000 కోట్లనే తిరిగిఇస్తోందని, లాభాలన్నింటినీ కేంద్రమే మూటగట్టుకుంటోందని విమర్శించారు. బీజేపీ జాతీయ నాయకులు, సీఎంలు ఒడిషాను చుట్టేస్తున్నారని, కానీ కాషాయ పార్టీ రాష్ట్రానికి ఏమీ చేయనందున వారి ప్రచార ప్రభావం అంతంతమాత్రమేనని అన్నారు. రాష్ట్రానికి మొండిచేయి చూపిస్తున్న కేంద్రం ఒడిషా వనరులతో సుసంపన్న రాష్ట్రమని మొసలి కన్నీరు కారుస్తున్నారని పాండ్యన్ అన్నారు.
గత 20 ఏండ్లుగా కేంద్ర పాలకులు బొగ్గు రాయల్టీని ఎందుకు సవరించడం లేదని ఆయన నిలదీశారు. ఒడిషా నుంచి కేంద్రం కొల్లగొడుతున్న వనరులు, నిధుల విషయం రాష్ట్ర ప్రజలకు అర్ధమైందని చెప్పారు. తమది ఖనిజ వనరులున్న రాష్ట్రమే అయినా వాటి నుంచి వచ్చే లాభాలను తాము తీసుకునేందుకు కేంద్రం అనుమతించడం లేదని దుయ్యబట్టారు. లాభాలన్నీ మీరు తీసుకుని మాకు కాలుష్యాన్ని మిగిల్చారని పాండ్యన్ ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :
Vijayashanti | కొత్త సినిమాకు విజయశాంతి గ్రీన్ సిగ్నల్.. మరోసారి పవర్ఫుల్ రోల్..!