నోయిడా: అతను ఒక రెసిడెన్షియల్ సొసైటీలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో ఉండి గురువారం రాత్రి సెక్యూరిటీ క్యాబిన్లో విశ్రాంతి తీసుకుంటున్న అతనిపై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. క్యాబిన్లోకి చొచ్చుకొచ్చి ఇష్టమొచ్చినట్లు కొట్టారు. ఇది గమనించిన మరో వ్యక్తి వద్దని వారించినా వారు పట్టించుకోలేదు. చివరికి గార్డు తీవ్రంగా ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడా సిటీలోని ఓ రెసిడెన్షియల్ సొసైటీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ దాడి ఘటనకు సంబంధించిన దృశ్యాలు సెక్యూరిటీ క్యాబిన్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియోను బాధితుడు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. దాంతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈస్ట్ ఢిల్లీలోని జగత్ విహార్కు చెందిన శరద్చంద్ర అనే వ్యక్తిని నిందితుల్లో ఒకరిగా గుర్తించి అరెస్ట్ చేశారు.
పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా తాము ఒక నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని, పరారీలో ఉన్న మరో నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. కాగా, బాధితుడైన సెక్యూరిటీగార్డుకు, నిందితులకు మధ్య కొన్ని రోజుల క్రితం పార్కింగ్ విషయంలో గొడవ జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అది మనసులో పెట్టుకుని నిందితులిద్దరూ గార్డుపై దాడికి పాల్పడినట్లు వెల్లడైంది.
#WATCH | UP: security guard of a residential society in Noida Sector 70 was thrashed by 2 men over a parking issue
(CCTV Visuals) pic.twitter.com/7cQz7EmrCk
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 19, 2023