లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో రైతుల మీదకు కేంద్ర మంత్రి కాన్వాయ్ దూసుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే నిరసన చేపడుతున్న అన్నదాతల మీదకు ఓ వాహనం దూసుకువెళ్లింది. దానికి సంబంధించిన వీడియోను ఇవాళ కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ పోస్టు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. కానీ ఆ వీడియో ఎంత వరకు నిజం అన్న దానిపై స్పష్టత లేదు. ఎస్యూవీ డ్రైవర్ సీటులో ఎవరు ఉన్నారన్న దానిపై కూడా క్లారిటీ లేదు. ప్రియాంకా గాంధీ తన ట్వీట్లో ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. తనను నిర్బంధించి 28 గంటలు అవుతోందని, కానీ అన్నదాతల మీద నుంచి కారును తీసుకెళ్లిన వ్యక్తిని మాత్రం ఇంకా అరెస్టు చేయలేదని ఆమె అన్నారు.
కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ లఖింపూర్ ఖేరిలో రైతులు ధర్నా చేస్తున్న సమయంలో.. వారి వెనుక నుంచి ఓ వాహనం వచ్చి ఢీకొట్టింది. దానికి సంబంధించిన 25 సెకన్ల వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఆ వాహనం వెనుక మరో వాహనం సైరెన్లతో వెళ్లింది. కారు అకస్మాత్తుగా వచ్చి తమను ఢీకొట్టినట్లు రైతులు చెప్పారు. కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆ వాహనాన్ని నడిపినట్లు ఆరోపనలు ఉన్నాయి. కానీ తాము ఆ సమయంలో అక్కడలేమని కేంద్ర మంత్రి, ఆయన కుమారుడు చెప్పారు.
మంత్రి కాన్వాయ్లోని కారు బీభత్సం సృష్టించిన తర్వాత.. రైతులు భారీ విధ్వంసానికి దిగారు. ఆ ఘర్షణల్లో కొందరు చనిపోయారు. వాహనాలకు నిప్పుపెట్టారు. మంత్రి మిశ్రా కుమారుడిపై మర్డర్ కేసు పెట్టారు. చనిపోయిన రైతు కుటుంబాలకు 45 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రిటైర్డ్ జడ్జితో ఘటనపై దర్యాప్తు చేపట్టనున్నారు.