Viral news : జననాంగాల్లో ఇన్ఫెక్షన్ (Genital infection) కు చికిత్స చేయించుకునేందుకు ఓ వ్యక్తి ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. పరిశీలించిన వైద్యులు బయాప్సీ పరీక్ష (Biopsy test) చేయించారు. ఆ రిపోర్టు వచ్చిన తర్వాత సర్జరీ చేసి పేషెంట్ జననాంగాలను తొలగించారు. సర్జరీ అనంతరం మత్తు నుంచి తేరుకున్న వ్యక్తి తన జననాంగాలను తొలగించిన విషయం తెలుసుకుని లబోదిబోమంటున్నాడు. అసోం (Assam) రాష్ట్రంలోని సిల్చార్ ఆస్పత్రి (Silchar hospital) లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మణిపూర్ రాష్ట్రం జిరిబామ్ జిల్లాకు చెందిన అటికూర్ రెహ్మాన్కు జననావయవాల్లో ఇన్ఫెక్షన్ సోకడంతో చికిత్స కోసం అసోం రాష్ట్రం సిల్చార్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. పరిశీలించిన వైద్యులు అతడికి బయాప్సీ పరీక్ష చేయించారు. ఆ పరీక్షకు సంబంధించి రిపోర్టు వచ్చిన తర్వాత సర్జరీ చేయాల్సి ఉంటుందని రెహ్మాన్కు చెప్పారు. ఇన్ఫెక్షన్ తొలగించే సర్జరీ అనుకుని రెహ్మన్ ఒకే చెప్పాడు.
ఆ తర్వాత సర్జరీ చేసిన వైద్యులు రెహ్మాన్ జననాంగాలను తొలగించారు. సర్జరీ అనంతరం మత్తు నుంచి తేరుకున్న రెహ్మాన్ తన జననాంగాలను తొలగించిన విషయాన్ని గ్రహించాడు. దీనిపై వైద్యులను నిలదీయగా అసంబద్ధమైన సమాధానాలు చెప్పారు. దాంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా తనకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని బాధితుడు అసోం సీఎం హిమాంత బిశ్వశర్మకు మీడియా ద్వారా మొరపెట్టుకున్నాడు.