Manipur Violence | న్యూఢిల్లీ/ఇంఫాల్: గత మూడు నెలలుగా మణిపూర్లో హింసాత్మక ఘటనలు, ఆందోళనల మాటున జరిగిన అమానుష ఘటనలు, దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ముగ్గురు మహిళలను వివస్త్రలను చేసి, ఊరేగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక దాడి చేసి చంపేసిన ఘటనలకు సంబంధించి మరిన్ని వివరాలు తాజాగా బయటకు రావడం సంచలనంగా మారింది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ)కు జూన్ 12న ఓ ఫిర్యాదు అందింది. ఇందులో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనతో పాటు మే 4 నుంచి 15 మధ్య జరిగిన పలువురు కుకీ మహిళలపై లైంగిక దాడులు, వారిని హత్య చేసిన ఘటనలపై ఫిర్యాదుదారులు వివరాలు అందించినట్టు ఓ మీడియా సంస్థ పేర్కొన్నది.
1. కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలపై మే 4న లైంగిక దాడి జరిగింది. కాంగ్పోక్పీ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఆ ఇద్దరు మహిళలపై మైతీ వర్గానికి చెందిన అల్లరి మూక బహిరంగంగానే సామూహిక లైంగికదాడికి పాల్పడింది.(ఈ మహిళలనే నగ్నంగా ఊరేగించిన ఘటన వైరల్గా మారింది.)
2. మే 4న, ఓ నర్సింగ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులైన 22 ఏండ్ల కుకీ యువతి, ఆమె స్నేహితుడిని 40 మంది మైతీ గ్రూపు.. వేధించడంతో పాటు దాడి చేసింది.
3. మే 5న, కాంగ్పోక్పీ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 20 ఏండ్ల వయసు న్న ఇద్దరు యువతులపై లైంగికదాడి చేసి, హత్య చేశారు. మైతీ కమ్యూనిటీకి చెందిన కొంతమంది దుండుగులు, ఇంఫాల్లో కోనుంగ్ మమాంగ్ ఏరియాలో రెండున్నర గంటల పాటు గదిలో బంధించి చిత్రహింసలు పెట్టారు. తర్వాత గది తెరిచి చూస్తే, ఇద్దరు యువతులు రక్తపు మడుగులో ఉన్నారు.
4. మే 15న, ఇంఫాల్లోని ఓ ఏరియాలో మైతీ మూక ఓ 18 ఏండ్ల యువతిని అపహరించింది. ప్రతిఘటించే సరికి, ముక్కలుగా నరికేస్తామని దుండుగులు బెదిరించారు. అనంతరం బాధిత యువతికి నాగాలాంగ్లో కోహిమాలోని ఓ దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించగా, లైంగిక దాడి జరిగినట్టు నిర్ధారణ అయింది.
నెల క్రితం అందిన ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్ ఇప్పటివరకూ స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలపై జరిగిన అఘాయిత్యాలపై ఎన్సీడబ్ల్యూకి ఫిర్యాదు చేసే ముందు ఇద్దరు సామాజిక కార్యకర్తలు, నార్త్ అమెరికన్ మణిపూర్ ట్రైబల్ అసోసియేషన్ ప్రతినిధులు బాధిత మహిళలతో మాట్లాడారు. ఫిర్యాదు తర్వాత మహిళా కమిషన్ నుంచి ఎటువంటి స్పందన రాలేదని వారు ఆరోపించారు. ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖా శర్మ తాజాగా దీనిపై స్పందిస్తూ.. తమకు గత మూడు నెలలుగా మణిపూర్లో మహిళలపై జరుగుతున్న హింసకు సంబంధించి పలు ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర యంత్రాంగానికి పంపామని పేర్కొన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పుకొచ్చారు. అంతకుముందు మే 29న కూడా ఓ మహిళా సంఘం నుంచి ఫిర్యాదు వచ్చిందని.. తాజాగా వీడియో వైరల్ అయిన తర్వాత ఆమె వెల్లడించడం గమనార్హం.
మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో బయటకు వస్తే గానీ, పోలీసులు నిందితులను అరెస్టు చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. ఈ ఘటనపై జూన్ 21న కేసు నమోదవగా ఇప్పుడు హడావుడిగా నలుగురిని అరెస్టు చేసినట్టు ప్రకటించడం.. పోలీసులు, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతున్నది. కాగా, నలుగురు నిందితులకు 11 రోజుల కస్టడీ విధించారు. సైకుల్ పోలీసుస్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం.. బీ ఫైనోమ్ గ్రామంలోకి ఏకే రైఫిల్స్, ఎస్ఎల్ఆర్ వంటి ఆయుధాలతో చొరబడిన 900-1000 మంది గుంపు భయోత్పాతం సృష్టించారు. ఇండ్లను లూటీ చేసి, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. అనంతరం ఇండ్లను ధ్వంసం చేసి, నిప్పుపెట్టారు. ప్రతిఘటించిన పలువురిని చంపేశారు.
మహిళలను నగ్నంగా ఊరేగించి, లైంగిక దాడి చేసిస ఘటనపై రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దారుణ ఘటనలో ప్రధాన నిందితుడైన హుయిరేమ్ హెరోదాస్ ఇంటిని గురువారం రాత్రి తగులబెట్టారు. తౌబాల్ జిల్లా పెచ్చి అవాంగ్ లైకై గ్రామంలోని అతని ఇంటిని చుట్టుముట్టిన స్థానికులు.. టైర్ల సాయంతో ఇంటికి మంటపెట్టారు. వీరిలో ఎక్కువగా మహిళలే ఉన్నట్టు తెలుస్తున్నది.
మహిళల వివస్త్ర ఘటన తర్వాత మణిపూర్ హింసకు సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. ఓ వ్యక్తి తలను నరికి, వేలాడదీసిన వీడియో వైరల్గా మారింది. బాధితుడ్ని కుకీ తెగకు చెందిన డేవిడ్ థీక్గా గుర్తించారు. జూన్ 2న బిష్ణుపూర్ జిల్లాలోని ఓ ఏరియాలో జరిగిన ఘర్షణల్లో చనిపోయిన ముగ్గురిలో డేవిడ్ ఒకరుగా తెలుస్తున్నది.