బీజేపీ కార్యకర్తలపై దుండగుల దాడి
ఆరుగురు చనిపోయారన్న బీజేపీ
తృణమూల్ గూండాల పనేనని ఆరోపణ
కేంద్రం సీరియస్.. నివేదికివ్వాలని ఆదేశం
ముగ్గురు మావాళ్లని చంపేశారు: తృణమూల్
కోల్కతా, మే 3: ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్లో సోమవారం భారీ హింసాకాండ చెలరేగింది. కోల్కతా, చుట్టు పక్కల ప్రాంతాల్లో దుండగులు కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. బీజేపీ కార్యాలయాలకు నిప్పు పెట్టారు. దుకాణాలను దోచుకొన్నారు. హింసాకాండలో ఓ మహిళ సహా ఆరుగురు బీజేపీ కార్యకర్తలు చనిపోయారని ఆ పార్టీ తెలిపింది. తృణమూల్ గూండాలే హింసకు కారణమని ఆరోపించింది. హింసాకాండ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దుండగులు పిల్లలపై, జంతువులపై కూడా దాడులు జరిపారని బీజేపీ అధికార ప్రతినిధి అనిల్ బలూనీ వీడియోలు ట్వీట్ చేశారు. గాయాలతో ప్రజలు పారిపోతున్న దృశ్యాలు వీడియోల్లో ఉన్నాయి. బెంగాల్లో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులపై నివేదిక ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. మరోవైపు, తమ కార్యకర్తలు ముగ్గుర్ని బీజేపీ కార్యకర్తలు చంపేశారని తృణమూల్ ఆరోపించింది. హింసాకాండను సీఎం మమత ఖండించారు. తృణమూల్ కార్యకర్తలు సంయమనం పాటించాలని, బీజేపీ కార్యకర్తలు రెచ్చగొడితే రెచ్చిపోవద్దని సూచించారు.