న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ఎలక్షన్ కింగ్ కే పద్మరాజన్.. ఏ ఎన్నికైనా సరే తగ్గేదేలే అంటారాయన. గెలుపోటములతో సంబంధం లేదు.. పోటీ చేశామా? లేదా? అన్నదే ఆయనకు లెక్క. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ ఓ నామినేషన్ వేయనిదే ఊరుకోరు. అలా ఇప్పటివరకు 238 నామినేషన్లు వేశారు. అయినా అన్ని ఎన్నికల్లోనూ ఓడిపోయారు. ఇందుకోసం డిపాజిట్లుగా మొత్తం రూ.80 లక్షలు పోగొట్టుకున్నారు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా 239వసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.
తమిళనాడులోని ధర్మపురి లోక్సభ స్థానం, కేరళలోని త్రిస్సూర్ నుంచి పోటీ చేస్తున్నారు. 1988 నుంచి పోటీ చేస్తున్న ఈయన.. 238 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు కూడా సంపాదించుకున్నారు. గిన్నిస్ బుక్ రికార్డు కోసం ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. ఈయన వాజపేయీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్, వైఎస్ రాజశేఖర్రెడ్డి తదితరులపై పోటీ చేశారు.
ఇండోర్కు చెందిన పర్మానంద్ థొలానీ కూడా వరుసగా ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు. ఈయన తండ్రి కూడా అనేక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. థొలానీ(65).. ఇప్పటి వరకు 18 ఎన్నికల్లో పోటీ చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని స్పష్టం చేస్తున్నారు. పుణె వాసి విజయ్ ప్రకాశ్ కోడేకర్(78) కూడా 24 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు.
పద్మరాజన్ కంటే ముందు ఉత్తరప్రదేశ్కు చెందిన కాకా జోగిందర్సింగ్ కూడా దాదాపు 300కు పైగా ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ప్రతి సారి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయటం.. ఓడిపోవటం రివాజుగా మారింది. లక్షలాది రూపాయల డిపాజిట్ కోల్పోయినా ప్రయత్నం మానలేదు. జోగిందర్సింగ్ 1998లో చనిపోయారు.