డెహ్రాడూన్ : కరోనా థర్డ్ వేవ్ తలెత్తుతుందనే ఆందోళనల నడుమ ఉత్తరాఖండ్ ప్రభుత్వం కొవిడ్-19 కర్ఫ్యూను సెప్టెంబర్ 14 వరకు పొడిగించింది. ఈ సమయంలో అన్ని మతపరమైన, సామాజిక, రాజకీయ, వినోద కార్యక్రమాలు నిషేధిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. కర్ఫ్యూ సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ యధాతథంగా కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
ఇక ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్తో పాటు వ్యాక్సినేషన్ పూర్తయిన విమాన, బస్, రైలు ప్రయాణీకులను రాష్ట్రంలోకి అనుమతించనున్నట్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. మరోవైపు ప్రభుత్వ కార్యాయాలు నూరు శాతం హాజరుతో పనిచేస్తాయని వెల్లడించింది. షాపులు, వాణిజ్య సంస్ధలు వారానికి ఆరు రోజులు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ తెరిచేందుకు అనుమతించారు.