షామ్లీ (ఉత్తరప్రదేశ్), నవంబర్ 22: డబుల్ ఇంజిన్ పాలనలో పేదల బతుకులు ఆగమైపోతున్నయి. కరెంటు రాదు. మీటర్లు యోగనిద్రలో ఉంటాయి. కానీ బిల్లుల మాత్రం రూ.వేలల్లో బాదుతున్నారు. వాటిని ఎలా కట్టాలో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇది పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లాలో రెండు డజన్లకు పైగా గ్రామాల గోస. అధికారులు హడావిడి చేసి ఇంటింటికి మీటర్లు పెట్టి వెళ్లారు. కొన్ని ఇండ్లల్లో అయితే నాలుగైదు మీటర్లు పెట్టారు. కానీ కరెంటు కనెక్షన్ ఇవ్వడం మరిచారు. కరెంటు మీటరులోని చక్రం కనీసం ఓ సుట్టు అయినా తిరగలేదు. ఒక్క బల్బయినా వెలగలేదు. ఉత్తుత్తి మీటరుకు బిల్లులు రావడం, అదీ వేలల్లో ఉండటంతో గ్రామస్థులు తలలు పట్టుకొంటున్నారు. కొందరికైతే 30 నుంచి 60 వేల వరకు బిల్లులు వచ్చాయి. దీంతో ఏంచేయాలో ఎవరిని అడగాలో తెలియక వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
మోసం.. దగా..
మీటర్లు పెట్టే సమయంలో అధికారులు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పారు. ఆ మాట మాటగానే ఉండిపోయింది. ‘అంతా మోసం.. దగా’ అని పేద కుటుంబాలవారు వాపోతున్నారు. పలు జాతీయ పత్రికల్లో దీనిపై వార్తా కథనాలూ వచ్చాయి. విద్యుత్తు బిల్లులు అందుకొన్న గ్రామాల్లో అల్లావుద్దీన్పూర్, డేరా, ఖోక్సా, నయాగావ్, భగీరథ్ ఉన్నాయి. ఈ గ్రామాల్లో చాలా వెనుకబడిన బావరియా తెగ ప్రజలు అధిక సంఖ్యలో ఉంటారు. వారిని ప్రధాన స్రవంతిలోకి తెస్తామని రాజకీయ నాయకులు అప్పుడప్పుడు వాగ్దానాలు చేస్తుంటారు. బావరియాలు సంచార జీవులు. అభివృద్ధికి ఆమడదూరంలో జీవనం సాగిస్తుంటారు. వేట ప్రధాన వృత్తి. వారికి మోటర్లు, మీటర్ల వంటివేవీ తెలియదు. ఖోక్సా గ్రామంలో 250 మంది కరెంటు బిల్లుల సమస్యతో సతమతమవుతున్నారు. ఊరికి కరెంటు స్తంభాలే వేయలేదు. కానీ ముందు మీటర్లు మాత్రం బిగించారు.
ఉచిత కరెంట్ ఇస్తామని..
‘మా ఇంటిలో అధికారులు నాలుగు మీటర్లు పెట్టారు. మీటర్లు ఉచితమన్నారు. ఉచిత కరెంటు కూడా ఇస్తామన్నారు’ అని సరోజ్ దేవి అనే గృహిణి చెప్పింది. గతవారం అధికారులు తమ ఇంటికి వచ్చి ఒక్కో మీటరుకు 50 నుంచి 60 వేల వరకు బిల్లులు ఇచ్చి వెళ్లారని వాపోయింది. తిండికే గడవని తాము అంతంత బిల్లులు ఎక్కడ నుంచి తెచ్చి కడతామని గ్రామస్థులు అంటున్నారు. చుట్టుపక్కల ఇతర గ్రామాలవారూ ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఖోక్సా గ్రామం మాజీ ప్రధాన్ భగత్రామ్ వివరించారు. సమస్యను పరిశీలించి చర్యలు తీసుకొంటామని ప్రాంతీయ విద్యుత్తు పంపిణీ సంస్థ ఎస్ఈ రామకుమార్ హమీ ఇచ్చారు.
మీటర్లు పారబోసి రైతన్నల నిరసనలు
మీటర్లు పెట్టి రైతన్న పొట్ట కొట్టాలని చూస్తున్న బీజేపీ సర్కారుపై రైతన్నలు ఇప్పటికే యుద్ధం మొదలెట్టారు. బోర్లకు మీటర్లు పెట్టినందుకు అక్కడి రైతులంతా కలిసి ప్రభుత్వంపై ఎదురు తిరిగారు. ఇటీవల బాగ్పత్ జిల్లాలో రైతులు మీటర్లను పీక్కొచ్చి ఆఫీసు ముందు పారబోశారు. అధికారులను నిర్బంధించి తమ నిరసన వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వం మా డిమాండ్లను పట్టించుకోవటం లేదు. ఇప్పటి దాకా రోడ్లనే దిగ్బంధించాం. మా డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో నిరసనలను తీవ్రతరం చేస్తాం’ అని అన్నదాతలు హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మీటర్లను బిగించేందుకు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్తు ఇస్తానని హామీ ఇచ్చిన యోగి సర్కారు.. ఇప్పుడు మీటర్లు పెట్టి రైతుల వద్ద ఇష్టమొచ్చినట్టు బిల్లులు వసూలు చేయాలని చూస్తున్నదని రైతు నేత అంకిత్ తోమర్ మండిపడ్డారు. వచ్చే అరకొర ఆదాయంతో తడిసిమోపెడయ్యే బిల్లులను కట్టలేమని స్పష్టం చేశారు. గతంలో నెలకు రూ.2 వేలకు మించి బిల్లు వచ్చేది కాదని, మీటర్లు బిగించాక రూ.10 వేలు దాటుతున్నదని వివరించారు.