లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్.. మరోసారి అబ్బాజాన్ అనే పదాన్ని వాడారు. సమాజ్వాదీ పార్టీ నేతలను విమర్శించే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ముస్లిం పిల్లలు తమ తండ్రులను ప్రేమపూర్వకంగా పిలిచేందుకు అబ్బా జాన్ అంటుంటారు. అయితే సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్తో పాటు ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ను అబ్బాజాన్ అంటూ సీఎం యోగి పరోక్షంగా కామెంట్ చేశారు. ఆదివారం కుషీనగర్లో జరిగిన రేషన్ పంపిణీ కార్యక్రమంలో ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. 2017 కంటే ముందు ఈ రేషన్ అబ్బా జాన్ అన్నవాళ్లు మాత్రమే ఆరగించేవాళ్లు అని విమర్శించారు. అయితే అబ్బా జాన్ అంటూ సీఎం యోగి ఆ పదాన్ని వాడడాన్ని సోషల్ మీడియాలో కొందరు యూజర్లు తప్పుపట్టారు. ఆ మాటలు వర్గ హింసకు దారి తీస్తాయని ఆరోపిస్తున్నారు. ప్రస్తుత బీజేపీ ఎవర్నీ వేరుగా చూడదని, ప్రతి ఒక్కరికీ రేషన్ అందేలా చూస్తోందని సీఎం తెలిపారు.
గతంలో అబ్బా జాన్ అని పిలిచేవాళ్లకు మాత్రమే రేషన్ దక్కేదని, కుషీనగర్లో ఉండాల్సిన రేషన్.. నేపాల్, బంగ్లాదేశ్లో కనిపించేదని, ఇప్పుడు ఎవరైనా పేదవాడి రేషన్ను మింగాలని చూస్తే, ఆ వ్యక్తి జైలులో ఊచలు లెక్కపెట్టాల్సిందే అని సీఎం యోగి అన్నారు. 2012 నుంచి 2017 వరకు యూపీలో సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం నడిచింది. 1990లో కరసేవకులపై ములాయం దాడి చేయించారని యోగి విమర్శించారు. బాబ్రీ మసీదుపై ఒక్క పిట్ట కూడా వాలకుండా చూస్తానని అబ్బా జాన్ అన్నట్లు సీఎం యోగి గుర్తు చేశారు. కానీ బీజేపీ ప్రభుత్వం ఆ స్థలంలో రామ మందిరాన్ని నిర్మిస్తున్నట్లు సీఎం యోగి తెలిపారు.
అబ్బా జాన్ వ్యాఖ్యల పట్ల సమాజ్వాదీ నేత అఖిలేశ్ యాదవ్ రియాక్ట్ అయ్యారు. సీఎం యోగి తన భాషను అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ప్రజల సమస్యలపై పోరాటం చేద్దాం, కానీ తన తండ్రి
గురించి ఏం మాట్లాడినా, అప్పుడు మీ తండ్రి గురించి కూడా మాట్లాడాల్సి వస్తుందని అఖిలేశ్ అన్నారు.