Yogi Adityanath : ఉత్తర ప్రదేశ్, అయోధ్యలోని రామ మందిరంలో విరాళాలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ అంశంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. నిందితులు ఎలాంటివారైనా, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని సీఎం హెచ్చరించారు. యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం అయోధ్యలో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. రామ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రజలు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆయన కోరారు.
అలాగే, ఈ అంశంపై సిట్ దర్యాప్తు జరుపుతోందని, దీనికి సంబంధించి ఎవరివద్దనైనా ఆధారాలుంటే సిట్కు సమర్పించాలని ఆయన సూచించారు. ఆలయ ట్రస్ట్ వినతి మేరకు ఈ అంశంపై దర్యాప్తు జరిపేందుకు సిట్ ఏర్పాటు చేశామని, ఈ అంశంలోని విషయాల్ని సిట్ వెలుగులోకి తెస్తుందని భావిస్తున్నామని యోగి అన్నారు. భక్తులు కూడా ఆలయంపై జరుగుతున్న అనేక దుష్ప్రచారాలను నమ్మకుండా సహనంతో ఉండాలని, ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలకు దూరంగా ఉంటూ, రాముడికి సంబంధించి గౌరవం, సహనం కలిగి ఉండాలని భక్తులను కోరారు. రామాలయ ఉద్యమాన్ని కాంగ్రెస్, ఎస్పీలు అడ్డుకుంటున్నాయని, గత ప్రభుత్వాలు రామ భక్తులకు, కర సేవకులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నారని యోగి గుర్తు చేశారు. గతంలో అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఇక్కడి ఆలయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు నటిస్తోందని, ఇది ఆ పార్టీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం అన్నారు.
రామాలయ ఉద్యమాన్ని కూడా కోర్టులో కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందున్నారు. రామభక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటున్న సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) గతంలో కరసేవకులపై కాల్పులు జరపాలంటూ ఆదేశించిందని, జై శ్రీరామ్ అన్నవారిపై దళాల్ని ప్రయోగించిందంటూ యోగి విమర్శించారు. అయోధ్యలోని రామ మందిరానికి వచ్చిన విరాళాల విషయంలో అవకతవకలు, అక్రమాలు జరిగాయనే విషయం తాజాగా వెల్లడైంది. భక్తులు సమర్పించిన కానుకలు దేవాలయానికి చెందకుండా కొందరు సిబ్బంది కాజేశారని తేలింది. దీనిపై ప్రస్తుతం సిట్ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయంలో కొన్ని ప్రాథమిక ఆధారాలు కూడా లభించాయి.