హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా పెద్దఎత్తున యూరియా దారి మళ్లుతున్నది. వ్యవసాయానికి ఉపయోగించాల్సిన యూరియా పరిశ్రమలకు తరలిపోతున్నది. కేంద్ర ఎరువులు, రసాయన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ ఫ్లైయింగ్ స్వాడ్(ఎఫ్ఎఫ్ఎస్) దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. 15 రాష్ర్టాల్లో దాడులు నిర్వహించగా పరిశ్రమలకు తరలిస్తున్న 70 వేల బస్తాల యూరియా పట్టుబడింది. ఈ మేరకు దాడుల వివరాలను కేంద్రం మంగళవారం వెల్లడించింది. 30 మందిపై కేసులు నమోదు చేయగా 11 మందిని జైలుకు పంపించారు. మిక్చర్ ఫర్టిలైజర్ తయారు చేసే 112 కంపెనీల గుర్తింపును రద్దు చేసింది.
పరిశ్రమల అవసరాల కోసం
పంటల సాగుకు కేటాయించిన యూరియాను పరిశ్రమల అవసరాల కోసం అక్రమంగా తరలిస్తున్నారు. పరిశ్రమల్లో రెజిన్, ప్లైవుడ్, క్రాకర్స్, మౌల్డింగ్ పౌడర్, పశుదాణా, డెయిరీ అవసరాలకు, పేలుడు పదార్థాల తయారీ వంటి వాటికి యూరియాను వినియోగిస్తున్నారు. యూరియాను అక్రమంగా పరిశ్రమలకు తరలిస్తుండటంతో రైతులకు యూరియా కొరత ఏర్పడుతున్నది. ఈ నేపథ్యంలోనే ఎఫ్ఎఫ్ఎస్ తనిఖీలు చేస్తున్నది.
తెలంగాణలో తక్కువ
తెలంగాణలో ఎరువులు, విత్తనాలు బ్లాక్ మార్కెట్ కాకుండా, కొరత లేకుండా రాష్ట్రప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకున్నది. దీంతో పరిశ్రమలకు తరలిపోకుండా అడ్డుకోగలిగారు. దేశవ్యాప్తంగా ఎఫ్ఎఫ్ఎస్ నిర్వహించిన తనిఖీల్లో ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో తక్కువ యూనిట్ల యూరియా పరిశ్రమలకు తరలినట్టు తేలింది. ఇక్కడ కేవలం 4 యూనిట్ల యూరియా మాత్రమే తరలిపోయినట్టు గుర్తించారు. అత్యధికంగా రాజస్థాన్, కేరళలో 27 యూనిట్ల యూరియా పరిశ్రమలకు తరలిపోగా ఆ తర్వాత హర్యానాలో 25 యూనిట్లు, గుజరాత్లో 19 యూనిట్లు, యూపీలో 10 యూనిట్ల యూరియా తరలిపోయింది. ఇక కర్ణాటకలో 6 యూనిట్లు, పంజాబ్లో 5 యూనిట్లు పరిశ్రమలకు తరలించినట్టు వెల్లడైంది.