న్యూఢిల్లీ: ప్రతి ఏడాది యూపీఎస్సీ(UPSC ) సివిల్ సర్వీసెస్ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు ముగియగానే.. యూపీఎస్సీ ఆ పరీక్షకు చెందిన ఆన్సర్ కీని రిలీజ్ చేస్తుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. రాజ్యసభలో మంత్రి దీనిపై లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. యూపీఎస్సీ వెబ్సైట్లో జవాబు పత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఐఏఎస్, ఐఎఫ్స్, ఐపీఎస్లను ఎంపిక చేసేందుకు యూపీఎస్సీ ప్రతి ఏడాది ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.
అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రిలిమినరీ పరీక్షల జవాబు పత్రాన్ని రిలీజ్ చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. 2026 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల నుంచి ఈ విధానాన్ని మొదలుపెట్టనున్నట్లు మంత్రి చెప్పారు. యూపీఎస్సీ నిర్వహించే అన్ని పరీక్షలకు ఇది వర్తిస్తుందన్నారు. అయితే ప్రిలిమినరీ పరీక్షల మార్క్లను మాత్రం తుది ఫలితాలు వెల్లడించిన తర్వాతే డిక్లేర్ చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
ఆన్సర్ షీట్ల విశ్లేషణకు చెందిన సమగ్రమైన వివరాలను యూపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు చెప్పారు. ఆప్షనల్ సబ్జెక్టల అంశంలో స్టాండర్డ్ విధానాన్ని పాటించేందుకు తీసుకునే చర్యల గురించి మంత్రి చెప్పారు. యూపీఎస్సీ అభ్యర్థులు తమ ఫిర్యాదులను సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు.