ఉత్తరప్రదేశ్లో నాలుగో దశ పోలింగ్ సమయంలో వింత ఘటన జరిగింది. లఖీంపూర్ ఖేరిలోని సదర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడి సాని గ్రామంలో ఈవీఎం మిషన్ మొరాయించింది. ఓటు వేసే బటన్ జామ్ అయిపోయినట్లు తెలుసుకున్న అధికారులు వెంటనే పోలింగ్ నిలిపివేశారు. ఈవీఎం మిషన్పై ఫెవీక్విక్ వంటి జిగురు పదార్థం వేసినట్లు వాళ్లు గుర్తించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు. గుర్తు తెలియనవి వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. యూపీ ఎన్నికల నాలుగో దశలో భాగంగా 9 జిల్లాల్లోని 59 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగానే ఫెవీక్విక్ ఘటన వెలుగు చూసింది. ‘‘సమాచారం అందగానే పోలీసు బలగాలు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నాం. ఖేరి పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాం’’ అని లఖీంపూర్ ఖేరి ఎస్పీ సంజీవ్ సుమన్ తెలియజేశారు.
ఈ ఘటన వల్ల ఓటింగ్ నిలిచిపోవడంతో చాలా మంది ఓటర్లు క్యూలో చాలా సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. నాలుగో దశ పోలింగ్లో మొత్తం 2.13 కోట్ల మంది యూపీ ప్రజలు ఓటింగ్ ద్వారా 624 మంది అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయిస్తారు.