Jana Nayagan | కోలీవుడ్ స్టార్ యాక్టర్ దళపతి విజయ్ (Thalapathy Vijay) కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా జన నాయగన్ (Jana Nayagan). కార్తీ (ఖాకీ) ఫేం హెచ్ వినోథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ జులై 23న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తెలుగులో ప్రజల నాయకుడు టైటిల్తో రిలీజ్ కానుంది. మరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత వెంకట్ కే నారాయణ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు. ఈ సినిమా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరికి రీమేక్గా వస్తుందంటూ నెట్టింట పుకార్లు షికారు చేశాయని తెలిసిందే. ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత.
నిర్మాత వెంకట్ కే నారాయణ చిట్ చాట్లో మాట్లాడుతూ.. మనం జీవితంలో ఎంతో మందిని కలుస్తుంటాం.. కానీ కొంతమంది మాత్రమే మనపై చెరగని ముద్ర వేస్తారు.అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు విజయ్ సార్. జననాయగన్ విజయ్ అభిమానులకు ఎప్పుటికీ గుర్తుండిపోయే అనుభూతులివ్వడం గ్యారంటీ. సినిమాను వరల్డ్వైడ్గా 7 వేల నుంచి 8 వేల స్క్రీన్లలో సినిమాను గ్రాండ్గా విడుదల చేయాలని మేం ప్లాన్ చేస్తున్నాం. విజయ్ సార్ అద్భుతమైన సినిమాటిక్ జర్నీకి నివాళిగా సినిమా ఉండబోతుందని చెప్పుకొచ్చారు.
అదే విధంగా భగవంత్ కేసరి విజయ్ సార్కు, నాకు బాగా కనెక్ట్ అయిన సినిమా. మేము కేవలం భగవంత్ కేసరిని స్ఫూర్తిగా తీసుకున్నాం.. ఈ విషయాన్ని అనిల్ రావిపూడితో కూడా చర్చించాం. జననాయగన్ కొత్త సంఘర్షణలు, కొత్త ప్రపంచంలో సాగే పూర్తి కొత్త కథతో సాగుతుంది. ప్రేక్షకులకు బావోద్వేగపూరితంగా కనెక్ట్ అవుతూనే.. తప్పకుండా తాజా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని హామీనిస్తున్నానన్నారు నిర్మాత. ఇప్పుడీ కామెంట్స్ సినిమాపై మరింత అంచనాలు పెంచేస్తున్నాయి.
జన నాయగన్ చిత్రంలో పూజా హెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. మమితా బైజు కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్, కోలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.