గద్వాల: వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరా అందకపోవడంపై రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సాగునీటి కోసం ఎదురుచూస్తున్న వేళ తరచూ కరెంట్ అంతరాయాలు ఏర్పడటంతో పంటలు నష్టపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ కోతలను నిరసిస్తూ మల్దకల్ సబ్స్టేషన్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. గద్వాల–అయిజ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. వ్యవసాయ మోటార్లకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరా విషయంలో అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
రైతులు రహదారిపై బైఠాయించడంతో గద్వాల–అయిజ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రహదారికి ఇరువైపులా వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే చర్యలు చేపట్టారు. రైతుల ఆందోళన కొనసాగుతుండటంతో ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.