లక్నో, జనవరి 11: దేశ రాజకీయాలను మలుపుతిప్పుతాయని భావిస్తున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. యోగి క్యాబినెట్లో మంత్రి, ఓబీసీ కీలక నేత స్వామి ప్రసాద్ మౌర్య కాషాయపార్టీని వీడారు. ఆయన బాటలోనే మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీని వదిలి సమాజ్వాదీ పార్టీలో చేరారు. రాజీనామా చేసిన వెంటనే ఆయన ఎస్పీ అధినేత అఖిలేశ్యాదవ్ను కలిశారు. మౌర్యతో కలిసి ఉన్న ఫొటోను అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మౌర్య రాజీనామా షాక్ నుంచి బీజేపీ తేరుకోకముందే ఎమ్మెల్యేలు రోషన్లాల్ వర్మ, బ్రిజేశ్ ప్రజాపతి, భగవతి సాగర్, వినయ్ షక్యా తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒకేసారి మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో కాషాయదళంలో కలవరం మొదలైంది. మరో 13 మంది ఎమ్మెల్యేలు త్వరలోనే ఎస్పీ గూటికి చేరనున్నట్టు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొనడం కమలనాథులకు మరింత గుబులు పుట్టిస్తున్నది. వచ్చే ఎన్నికల్లో ఎస్పీతో కలిసి పోటీచేయనున్నట్టు పవార్ ప్రకటించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ ఎన్నికల్లో పోటీచేయబోరని ఆ పార్టీ నేత ఎస్సీ మిశ్రా వెల్లడించారు.
యోగిది పేదల వ్యతిరేక ప్రభుత్వం
రాజీనామా అనంతరం స్వామి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం యోగి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘సైద్ధాంతిక వైరుధ్యం ఉన్నప్పటికీ యోగి క్యాబినెట్ మంత్రిగా ఎంతో నిబద్ధతతో పనిచేశా. కానీ ప్రభుత్వంపై దళితులు, ఓబీసీలు, రైతులు, నిరుద్యోగులు, చిన్న వ్యాపారుల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. అందుకే నేను రాజీనామా చేశా’ అన్నారు.
మౌర్య చేరిన పార్టీ ఓడింది లేదు
దశాబ్ద కాలంగా స్వామి ప్రసాద్ మౌర్య ఉన్న పార్టీ యూపీ ఎన్నికల్లో ఓడిపోలేదు. 2016లో రాష్ట్రంలో నంబర్ 1 స్థానంలో ఉన్న బీఎస్పీ నుంచి బయటకు వచ్చారు. 2017 అసెంబ్లీ ఎన్నికల కోసం బీఎస్పీ టికెట్లు అమ్ముకొంటున్నదని ఆరోపణలు చేశారు. ఆ తర్వాత లోక్తాంత్రిక్ బహుజన్ మంచ్ పేరుతో పార్టీ పెట్టారు. 2017 ఎన్నికల్లో బీజేపీలో చేరి, ఎన్నికల తర్వాత మంత్రి అయ్యారు. స్వామి ప్రసాద్ మౌర్య యూపీలోని కుషీనగర్, ప్రతాప్గఢ్, కాన్పూర్ దేహట్, బందా, షాజహాన్పూర్ జిల్లాల్లోని కనీసం 20 నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేయగల నేత.
బీజేపీ నేతల కలవరపాటు
ఎన్నికలకు నెలరోజుల ముందు స్వామి ప్రసాద్ మౌర్య ఇచ్చిన షాక్ నుంచి బీజేపీ ఇంకా తేరుకోలేదు. ఆయన రాజీనామాపై మరో ఓబీసీ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి కేశవ్ప్రసాద్ మౌర్య ట్విట్టర్లో స్పందించారు. పార్టీ నుంచి వెళ్లిపోవద్దని విజ్ఞప్తి చేశారు. సమస్యలుంటే చర్చించుకొందామని కోరారు. దీనిపై స్వామి ప్రసాద్ స్పందిస్తూ కేశవ్ప్రసాద్ మాట్లాడుకొందామని ఇప్పుడు అంటున్నారని, చర్చలు అవసరమైనప్పుడు ఎవరికీ సమయం లేదని విమర్శించారు.
స్వామి ప్రసాద్ మౌర్య ఎవరు?
మౌర్య అంబేద్కర్ సిద్ధాంతాలను బలంగా నమ్ముతారు. 1996లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి, మరుసటి ఏడాది క్యాబినెట్ మంత్రి అయ్యారు. ఆ తర్వాత ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సభా నాయకుడిగా, ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. బీజేపీని వీడిన నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఓబీసీలు, ఒకరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు.
ఎస్పీలో కొత్త జోష్
మౌర్య చేరికతో ఎస్పీలో కొత్త జోష్ కనిపిస్తున్నది. బీజేపీని ఎలాగైనా గద్దె దింపాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఎస్పీ అధినేత అఖిలేశ్యాదవ్, ఎన్నికలకు ఏడాది ముందునుంచే ఓబీసీ, ఎస్సీలను బీజేపీకి దూరం చేయటం ప్రారంభించారు. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లిన బలమైన ఓబీసీ నేత ఓపీ రాజ్భర్ను తనవైపు తిప్పుకొన్నారు. యూపీ ఓబీసీల్లో యాదవ సామాజికవర్గానిదే ఆధిపత్యం. యాదవేతర ఓబీసీ నేతల్లో రాజ్భర్తోపాటు స్వామి ప్రసాద్ శక్తిమంతులు. యూపీలో బీజేపీకి ఎస్పీనే ప్రత్యామ్నాయమని ప్రజలు బలంగా నమ్ము తున్నట్టు అఖిలేశ్ అన్నారు.
యూపీ బీజేపీ తాళాలు వేసుకోవాల్సిందే: ఎస్పీ నేత
మార్చి 10న యూపీ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన తర్వాత పార్టీ ఆఫీసును మూసేసేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్వతంత్రదేవ్సింగ్కు కొన్ని తాళాలు పంపించినట్టు ఎస్పీ ప్రతినిధి ఐపీ సింగ్ ట్విట్టర్లో పోస్టు పెట్టారు. మొత్తం మూడు తాళాలని ఒకటి రాష్ట్ర పార్టీ ఆఫీసుకు, రెండోది బీజేపీ రాష్ట్ర కార్యదర్శికి, మూడోది సీఎం యోగి ఆదిత్యనాథ్కు పంపానన్నారు.
ఎస్పీతో ఎన్సీపీ జట్టు
యూపీలో కలిసి పోటీచేస్తాం: పవార్
ముంబై, జనవరి 11: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)తో కలిసి పోటీచేయనున్నట్టు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం మీడియాతో మాట్లాడారు. యూపీ ప్రజలు మార్పును కోరుకొంటున్నారని, మత రాజకీయాలను ప్రోత్సహించే వారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెప్పనున్నట్టు తెలిపారు. ఎస్పీ త్వరలో నిర్వహించబోయే భేటీలో తాను పాల్గొనబోతున్నట్టు పేర్కొన్నారు. యూపీ బీజేపీకి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు త్వరలోనే ఆ పార్టీని వీడి ఎస్పీలో చేరనున్నట్టు జోస్యం చెప్పారు.
కాంగ్రెస్, తృణమూల్తో..
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్తో కలిసి పోటీ చేయడానికి చర్చలు జరుపుతున్నట్టు పవార్ తెలిపారు. ఈ మేరకు ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, శివసేన నేత సంజయ్రౌత్ స్థానిక కాంగ్రెస్ నేతలతో మాట్లాడుతున్నట్టు వెల్లడించారు.
మాయావతి పోటీ చేయరు: బీఎస్పీ
రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి పోటీ చేయబోరని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ఎస్సీ మిశ్రా వెల్లడించారు. తాను కూడా పోటీ చేయబోనని తెలిపారు. అధికార పీఠం రేసులో బీఎస్పీ లేదని సర్వేలు చెబుతుండటంపై స్పందిస్తూ.. తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని, ఐదోసారి మాయావతి సీఎంగా ప్రమాణం చేస్తారని పేర్కొన్నారు.