మీటర్లపై రగులుతున్న అన్నదాతలు
27న మీరట్ విద్యుత్తు ఆఫీసు ఎదుట బీకేయూ ధర్నా
ఇప్పటికే వందల మీటర్లను ఊడబీకి రైతన్నల నిరసన
వందల్లో వచ్చే బిల్లుల్ని వేలల్లో వేస్తున్నారంటూ గుస్సా
సాగుకు ఉచిత కరెంట్ ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం
యోగి సర్కారు ఎందుకివ్వట్లేదు: బీకేయూ నేత త్యాగి
వాళ్లకే క్లారిటీ లేదు
యూపీ ఎన్నికల ముందు సాగుకు ఉచిత విద్యుత్తు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మరోవైపు బావులకు అమర్చే ప్రైవేటు కరెంటు మీటర్లకు 50% మినహాయింపుతో చార్జీ విధిస్తామని చెప్పింది. దీన్నిబట్టి వ్యవసాయ విద్యుత్తు సరఫరాపై యూపీ ప్రభుత్వానికే ఓ సరైన అవగాహన లేదని అర్థమవుతున్నది.
– బీకేయూ నేత రాకేశ్ టికాయిత్
మీరట్, జూన్ 24: బీజేపీ డబుల్ ఇంజిన్ రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో అన్నదాతలు రగిలిపోతున్నారు. బోరుబావులకు మీటర్లు పెట్టడమే కాకుండా.. వాటికి వారానికి వేలల్లో బిల్లులు ఇస్తుండటంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. యూపీ ఎన్నికలకు ముందు సాగుకు ఉచిత విద్యుత్తు ఇస్తామన్న బీజేపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి.. బిల్లుల మోత మోగిస్తున్నదంటూ మండిపడుతున్నా రు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మీటర్లను ఊడబీకి కరెంటు ఆఫీసుల్లో కుప్ప పోస్తున్న రైతు లు.. ఈ విషయంలో నేరుగా ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ తరహాలో రైతులకు ఉచిత విద్యుత్తు ఇచ్చేందుకు యోగి ఆదిత్యనాథ్ సర్కారుకు ఉన్న ఇబ్బందేంటని నిలదీస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ దుర్మార్గాన్ని ఎండగట్టేందుకు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఈ నెల 27న మీరట్లోని పశ్చిమాంచల్ విద్యుత్తు వితరణ్ నిగమ్ లిమిటెడ్ (పీవీవీఎన్ఎల్) కార్యాలయం ముందు రైతులతో పెద్ద ఎత్తున పంచాయత్ (ధర్నా) నిర్వహించనున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో వ్యవసాయ బావులకు మీటర్లను బిగించడాన్ని అడ్డుకుంటామని ఈ సందర్భంగా బీకేయూ నేతలు తేల్చి చెప్పారు.
మీటర్లను ఊడబీకిన 400 మంది అన్నదాతలు
అధిక బిల్లులతో విసిగి వేసారిన పశ్చిమ యూపీకి చెందిన పలు గ్రామాలకు చెందిన దాదాపు 400 మంది అన్నదాతలు విద్యుత్తు మీటర్లను ఊడబీకారు. ఎక్కువ బిల్లులు వస్తాయన్న భయంతోనే తాము ఈ పనిచేశామని పేర్కొన్నారు. ‘తొలుత అధికారులు బోర్లకు మీటర్లను బిగిస్తారు. తర్వాత బిల్లులు చెల్లించాలని వేధిస్తారు’ అని ఓ అన్నదాత వాపోయాడు.
ఆగ్రహజ్వాలలు
బోరు బావులకు మీటర్లను బిగించడాన్ని విరమించుకోవాలని మీరట్లోని డిస్కమ్ ఆఫీసు ముందు మంగళవారం 50 గ్రామాలకు చెందిన రైతులు నిరసనకు దిగారు. కరెంట్ మీటర్ల కారణంగా వేలల్లో బిల్లులు వస్తున్నాయని, అంత బిల్లులను చెల్లించలేకపోతున్నామని తుగ్లక్పూర్, కర్హేరా గ్రామస్థులు వాపోయారు. ఇదే విషయమై పుర్కాజీకి వెళ్లి బుధవారం బీకేయూ నాయకుడు ప్రతాప్సింగ్తో చర్చించారు. వస్తూ వస్తూ.. బావుల వద్ద నుంచి ఊడబీక్కుని వచ్చిన మీటర్లను పీవీవీఎన్ఎల్ ఆఫీసులో పారబోశారు. ముజఫర్నగర్లోని ఉమర్పూర్ రైతులు 61 కరెంట్ మీటర్లను స్థానిక కరెంట్ ఆఫీసులో ఇటీవల గుమ్మరించడం తెలిసిందే.
రూ.7 వేలకు పెరిగింది
వ్యవసాయ బావి బోరు బిల్లు గతంలో నెలకు రూ.1,500-రూ.1,700 వచ్చేది. ఈ మీటర్లు బిగించినప్పటి నుంచి వారానికే రూ.5,000-రూ.7,000 దాకా బిల్లు వస్తున్నది. అందుకే మీటర్లు వద్దు.
– అత్తర్ హుస్సేన్, రైతు, మాజీ సర్పంచ్ ఉమర్పూర్
తెలంగాణలో ఉచితంగా ఇస్తలేరా!
తెలంగాణ, పంజాబ్లో సాగుకు ఉచితంగానే విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. మిగతా రాష్ర్టాల్లో కూడా నామమాత్రపు రుసుముతో వ్యవసాయానికి కరెంటు సరఫరా చేస్తున్నారు. మరి, బీజేపీ అధికారంలో ఉన్న యూపీలో అలా ఎందుకు చేయట్లేదు?
–బీకేయూ డివిజనల్ ప్రతినిధి దినేశ్ త్యాగి
డీజిల్ పెంచారు.. ఇప్పుడు కరెంట్
ఇప్పటికే డీజిల్ రేట్లను విపరీతంగా పెంచారు. ఇప్పుడు కరెంటు వాత పెడుతున్నారు. కొత్త కరెంటు మీటర్ల రీడింగ్లతో వచ్చిన అధిక బిల్లులను చెల్లించాలని రైతులను బలవంతపెడితే వాళ్లు తీవ్రంగా నష్టపోతారు.
–బీకేయూ ముజఫర్నగర్ అధ్యక్షుడు యోగేశ్ శర్మ
నిబంధనల ప్రకారమే..
ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ బోర్డు నిబంధనల ప్రకారమే బోరు బావులకు మీటర్లు బిగిస్తున్నాం. ఐదు నెలల క్రితమే ఈ ప్రక్రియ ప్రారంభించాం.
– రాజీవ్ కుమార్, పీవీవీఎన్ఎల్ చీఫ్ ఇంజినీర్