న్యూఢిల్లీ, జనవరి 22: దేశంలో నాలుగేండ్లకు సరిపడా ధాన్యం నిల్వలున్నాయి.. రాష్ర్టాల నుంచి ధాన్యం కొనేది లేదు.. ప్రజాపంపిణీకి అవసరమైన ధాన్యానికి కొదువలేదు.. గత నాలుగు నెలలుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా, కనిపించిన ప్రతి బహిరంగ వేదికపైనా ఊదరగొట్టిన ప్రకటనలివి.. దేశంలో ఆకలి సమస్యే లేదని, ఆకలి చావులు లేవని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ కూడా సమర్పించింది. కానీ బీజేపీనే అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి తన భార్యాపిల్లల ఆకలికేకలు చూడలేక శుక్రవారం సుప్రీంకోర్టు ఎదుట ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. ఈ ఘటన దేనికి నిదర్శనం? కేంద్రం ఏం సమాధానం చెబుతుంది?
ఆకలిబాధలు చూడలేక..
అతడి పేరు రాజ్భర్ గుప్తా. యూపీలోని నోయిడా వాసి. తన భార్యాపిల్లలు ఆకలితో అలమటిస్తుండటాన్ని చూడలేక, గత్యంతరం లేని పరిస్థితుల్లో సర్వోన్నత న్యాయస్థానం ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. నిప్పంటించుకొన్నాడు. బాధితుడిని పోలీసులు రక్షించారు.
ధాన్యం కొనేందుకు నిరాకరణ
తమ వద్ద నాలుగేండ్లకు సరిపడా ఆహారధాన్యాలు ఉన్నాయన్న సాకుతో తెలంగాణ నుంచి వడ్లు కొనడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నది. అయితే అన్ని ఏండ్లకు సరిపడా ధాన్యం ఉన్నప్పుడు బీజేపీనే అధికారంలో ఉన్న యూపీ వ్యక్తి ఆకలితో ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసుకొన్నట్టు.. ఓ కుటుంబం అంతా ఆకలితో అలమటించే పరిస్థితి ఎందుకొచ్చినట్టు.. సహజంగానే ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
సామూహిక వంటశాలల ఊసేలేదు..
అన్నార్తులను ఆదుకోవడానికి దేశవ్యాప్తంగా సామూహిక వంటశాలలు ఏర్పాటు చేయాలని, అందుకు మార్గదర్శకాలను రూపొందించాలని సుప్రీం కోర్టు నెలల కిందనే కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణలో అమలవుతున్న అన్నపూర్ణ క్యాంటీన్ల తరహాలో వంటశాలలు ఉండాలని సూచించింది. ఈ వంటశాలల నిర్వహణకు కేంద్రప్రభుత్వం ఇప్పుడు సరఫరా చేస్తున్న ధాన్యానికి అదనంగా 2% ఇవ్వాలని పేర్కొన్నది. సుప్రీం కోర్టు ఎన్నిసార్లు ఆదేశించినా సామూహిక వంటశాలలపై కేంద్రంలోని బీజేపీ సర్కారు నత్తనడకను మానడం లేదు. సామూహిక వంటశాలలు ఏర్పాటు చేస్తే రాష్ర్టాలకు అదనంగా ధాన్యాన్ని సరఫరా చేయాలి. సరఫరా చేయాలంటే ఇప్పుడు సేకరిస్తున్న దానికంటే అదనంగా ధాన్యాన్ని సేకరించాలి. ఇది కేంద్రం బాధ్యత. వ్యవసాయాన్ని కార్పోరేటీకరణ చేయాలనుకొంటున్న కేంద్ర సర్కారుకు సహజంగా ఇది మింగుడుపడని విషయం. ఇప్పటికే బాధ్యతల నుంచి తప్పించుకోజూస్తున్న బీజేపీ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు అదనపు బాధ్యతలు పెట్టడం దానికి నచ్చడం లేదు. అందుకే సామూహిక వంటశాలల ఏర్పాటుపై సవాలక్ష సాకులు చెప్తున్నది.