లక్నో: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో విద్యుత్ ఉద్యోగులు సమ్మె (strike) బాట పట్టారు. తమ డిమాండ్ల కోసం గత మూడు రోజులుగా విధులను బహిష్కరించారు. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. విద్యుత్ సంస్థల్లో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎంపిక ప్రక్రియ కోసం, వేతనాల అవకతవకలకు వ్యతిరేకంగా విద్యుత్ శాఖ ఉద్యోగులు గురువారం రాత్రి నుంచి సమ్మె చేస్తున్నారు. విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర వ్యాప్త సమ్మె ఆదివారం కూడా కొనసాగింది. ఫరూఖాబాద్, ముజఫర్నగర్, ప్రయాగ్రాజ్లో సమ్మె తీవ్ర స్థాయికి చేరింది.
కాగా, విద్యుత్ ఉద్యోగుల సమ్మె వల్ల హర్దోయి, ఫిరోజాబాద్ , మురాదాబాద్, ఎటా, వారణాసి, రాయ్ బరేలీలో విద్యుత్ సరఫరాలో సమస్యలు నెలకొన్నాయి. దీంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాయ్ బరేలీలో సుమారు వెయ్యి గ్రామాలు చీకట్లో ఉన్నాయి. 70 అర్బన్ ప్రాంతాల్లో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. రాయ్బరేలీలో విద్యుత్ సరఫరా లేక పోవడంతో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. ఎయిమ్స్, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరెంటు లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. జనరేటర్ల ద్వారా విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే విద్యుత్ ఉద్యోగుల సమ్మె వల్ల 54గాను సగానికిపైగా విద్యుత్ కేంద్రాల్లో సమస్యలు తలెత్తాయి.
మరోవైపు విద్యుత్ శాఖ ఉద్యోగుల సమ్మె వల్ల సుదీర్ఘ విద్యుత్ కోతలపై వారణాసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. నగరంలోని భదాయిని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆందోళనలు, చక్కా జామ్ నిర్వహించారు. కాగా, సమ్మె విరమించకపోతే చర్యలు తప్పవన్న ప్రభుత్వ హెచ్చరికలను విద్యుత్ ఉద్యోగులు లెక్కచేయడం లేదు. సమ్మెలో పాల్గొన్న విద్యుత్ సిబ్బందిని సస్పెండ్ చేయడం లేదా అరెస్ట్ చేయడం వంటి చర్యలకు దిగితే నిరవధిక సమ్మె చేపడతామని విద్యుత్ కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Also Read: