న్యూఢిల్లీ: ఖలిస్థాన్ (Khalistan) వేర్పాటువాద సంస్థ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే (Waris Punjab De)’ చీఫ్ అమృత్పాల్ సింగ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. శనివారం పోలీసులకు చిక్కినట్టే చిక్కి మళ్లీ తప్పించుకున్నాడు. అమృత్పాల్ను అదుపులోకి తీసుకునేందుకు నిన్న (శనివారం) స్పెషల్ పోలీస్ టీమ్ ఆధ్వర్యంలో పంజాబ్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు 100కు పైగా కార్లతో అమృత్పాల్ కాన్వాయ్ని చేజ్ చేశారు.
సాయంత్రానికి అమృత్పాల్ను పట్టుకున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ, అమృత్పాల్ చిక్కినట్టే చిక్కి మళ్లీ తప్పించుకున్నాడని ఆ తర్వాత పోలీసులు స్పష్టత ఇచ్చారు. ఇవాళ కూడా అమృత్పాల్ అరెస్ట్ కోసం ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పారు. కాగా, అమృత్పాల్ అరెస్ట్ కోసం చేపట్టిన భారీ ఆపరేషన్లో భాగంగా పంజాబ్ పోలీసులు ఏడు జిల్లాల్లో సోదాలు, చేజింగ్లు నిర్వహించారు. ఈ క్రమంలో ‘వారిస్ పంజాబ్ దే’కు చెందిన 78 మందిని అరెస్ట్ చేశారు.
అయితే, అమృత్పాల్ అనుచరులతోపాటు అమృత్పాల్ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు శనివారం సాయంత్రం వార్తలు వినిపించాయి. కానీ, ఆ వార్తల్లో వాస్తవం లేదని పోలీసులు ప్రకటించారు. అతను ఇంకా పరారీలోనే ఉన్నాడని, శనివారం అంత పకడ్బంధీగా వలపన్నినా చివరకు తప్పించుకున్నాడని తెలిపారు. అయితే, పోలీసులు అన్నివైపుల నుంచి తరుముకొస్తూ చుట్టిముట్టినా చివరకు ఓ బైక్పై పారిపోతూ కనిపించినట్లు తెలుస్తోంది.
కాగా, అమృత్పాల్ అరెస్ట్ కోసం ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నందున పంజాబ్లో ఇంటర్నెట్ సేవలపై బ్యాన్ కూడా కంటిన్యూ అవుతున్నది. సోమవారం అర్ధరాత్రి 12 గంటల వరకు ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలపై నిషేధం కొనసాగుతుందని పోలీసులు చెప్పారు.