Viral News | అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నా అని సంతోషపడే లోపే ఓ వరుడికి వధువు షాకిచ్చింది. పెళ్లి తంతు, అప్పగింతలు అన్నీ అయిపోయిన తర్వాత అత్తగారింటికి రానంటూ మారాం చేసింది. కారులో మెట్టింటికి బయల్దేరిన వధువు.. ఎంతసేపటికి ఇల్లు రాకపోవడంతో మార్గమధ్యలోనే ఏడుపు లంకించుకుంది. అత్తగారిల్లు చాలా దూరం ఉంది.. నేను మా ఇంటికే వెళ్లిపోతా అంటూ కారులో నుంచి దిగి రోడ్డుపైనే బోరున విలపించింది. పెండ్లి బట్టలతో రోడ్డుపై అమ్మాయి ఏడుస్తూ కనిపించడంతో పోలీసులు రంగంలోకి దిగి ఏమైందని ప్రశ్నించడంతో ఈ విషయం బయటకొచ్చింది. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ వింత ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన ఓ యువతికి రాజస్థాన్కు చెందిన ఓ యువకుడితో ఇటీవల పెండ్లి జరిపించారు. మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశామనే సంతోషంతో వధువులు తల్లిదండ్రులు సంతోషంగా అప్పగింతలు పూర్తి చేశారు. వరుడి ఇల్లు చాలా దూరంలో ఉండటంతో త్వరత్వరగా పెళ్లి మండపం నుంచి కారులో సాగనంపారు. కన్నవాళ్లను విడిచి ఆగమాగంగా అత్తగారింటికి బయల్దేరడంతో వధువు గుండెల్లో గుబులు మొదలైంది. అత్తగారిల్లు ఎలా ఉంటుందో.. పుట్టింటికి రావాలంటే ఎలా? మళ్లీ ఎప్పుడు తల్లిదండ్రులను చూస్తానో అంటూ లోలోపల మదనపడిపోయింది. అలాగే కారు ఎక్కి కూర్చొంది.
మెట్టింటికి బయల్దేరి ఎంతసేపు అయినా రావట్లేదు.. ఇంకా జర్నీ తగ్గడం లేదు. దీంతో ఆమె భయం మరింత పెరిగిపోయింది. ఇంతలోనే గుండెల్లోని బాధ కన్నీళ్ల రూపంలో బయటకు పొంగుకొచ్చాయి. అంతే కారులో బోరున ఏడుపు అందుకుంది. అత్తారిల్లు చాలా దూరం ఉంది.. రాజస్థాన్కు రాను. వారణాసిలో మా పుట్టింటికి వెళ్లిపోతా అంటూ ఏడుపు లంకించుకుంది. ఈ హఠాత్పరిణామంతో షాకైన వరుడు, అతని బంధువులు రోడ్డు పక్కన కారు ఆపి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ కారు దిగిన పెండ్లి కూతురు రోడ్డు మీద ఏడుస్తూ కూర్చొంది.
రోడ్డుపై వరుసగా వాహనాలు ఆగి ఉండటం.. పెండ్లి దుస్తుల్లో అమ్మాయి ఏడుస్తూ కనిపించడంతో పోలీస్ రెస్పాన్స్ వాహనం సిబ్బంది మహరాజ్పూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు వాళ్లను అడిగి వివరాలను సేకరించారు. అన్ని విషయాలు ధ్రువీకరించుకున్న తర్వాత మహిళా సిబ్బంది సహాయంతో వధువును వాళ్ల పుట్టింటికి పంపించారు.