లక్నో: నడిరోడ్డుపై కారు పార్కింగ్ చేయడంతో.. ఆ దారిలో అత్యవసరంగా వెళ్తున్న అంబులెన్స్ ముందుకు పోయే పరిస్థితి లేక ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాడో బీజేపీ నేత. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో చోటుచేసుకొన్నది. తాను చేసిన పనికి చింతించి, క్షమాపణలు కోరాల్సిన ఆ బీజేపీ లీడర్.. తిరిగి బాధిత కుటుంబసభ్యులపైనే ఒంటికాలిపై లేస్తూ దూషించాడు. ‘పోలీసు కేసులో ఇరికిస్తా, నీ అంతు చూస్తా’ అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. సురేశ్ చంద్ర అనే వ్యక్తికి శనివారం ఛాతీనొప్పి వచ్చింది. గుండెపోటు అని వైద్యులు నిర్ధారించారు. జిల్లా దవాఖాన నుంచి లక్నోకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో నడిరోడ్డుపైనే స్థానిక బీజేపీ నేత, బ్లాక్ అధ్యక్షుడు రామ్కిందర్ పాండే సోదరుడు ఉమేశ్ మిశ్రా తన కారును పార్క్ చేసి, ఎక్కడికో వెళ్లాడు. దాదాపు 30 నిమిషాల పాటు అంబులెన్స్ ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో అందులో ఉన్న సురేశ్ చంద్ర పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు.
కలెక్టర్, ఎస్పీ నా ఆదేశాలతోనే పనిచేస్తారు!
కొద్ది సేపటికి వచ్చిన ఉమేశ్ మిశ్రా.. ప్రశ్నించిన బాధిత కుటుంబసభ్యులపైనే దూషణకు దిగాడు. కలెక్టర్, ఎస్పీ తన ఆదేశాల మేరకే పనిచేస్తారంటూ మాట్లాడాడు. ఇంత జరుగుతుంటే, ఘటనాస్థలిలోనే ఉన్న పోలీసులు ఉమేశ్ మిశ్రా వీరంగాన్ని కండ్లు అప్పగించి చూస్తూ ఉన్నారే తప్ప, జోక్యం చేసుకోకపోవడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. బీజేపీ నేత వ్యవహారశైలి, పోలీసులు చేష్టలుడిగి చూస్తుండటంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.