న్యూఢిల్లీ, మే 30: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి రాజస్థాన్ కాంగ్రెస్ శాఖలో ఐక్యత ఉన్నట్టు చూపడానికి కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నించింది. అయితే సీఎం అశోక్ గెహ్లాట్, అసమ్మతి నేత సచిన్ పైలట్ మధ్య పరిష్కరించాల్సిన మూల సమస్యలు అలాగే ఉన్నాయి. ఈ విషయాన్ని పైలట్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
సోమవారం ఢిల్లీలో ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదని పైలట్ వర్గం మంగళవారం తెలిపింది. పార్టీ అధిష్ఠానం గెహ్లాట్, పైలట్తో విడివిడిగా చర్చలు జరిపిందని, చివర్లో కేవలం ఫొటో కోసం ఇద్దరు నేతలను ఒక గదిలో కూర్చోబెట్టిందని తెలిపింది. అప్పుడు కూడా వారిద్దరూ ఏమీ మాట్లాడకుండా ఎడ మొహం- పెడ మొహం అన్నట్టు ఉన్నారని వారు వెల్లడించింది.