Mansuk Mandaviya : కేంద్ర బడ్జెట్లో ప్రకటించినట్టుగానే కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి ఒక నెల వేతనాన్ని వారి ఈపీఎఫ్ (EPFO) ఖాతాల్లో జమ చేయనున్నట్టు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఆ ప్రకారం ఒక ఉద్యోగి ఖాతాలో గరిష్ఠంగా రూ.15 వేలు జమకానున్నాయి. ఇక తెలంగాణలో 36,018 సంస్థల కింద 47.96 లక్షల మంది చందాదారులు, 4.54 లక్షల మంది పెన్షన్ తీసుకునేవాళ్లు ఉన్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు.
కేంద్రమంత్రి మాండవీయ హైదరాబాద్ బర్కత్పురాలోని పీఎఫ్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC)పై మన్సుఖ్ మాండవీయ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈపీఎఫ్ తెలంగాణ జోన్లో ఏటా రూ.7,797 కోట్ల చెల్లింపులు జరుగుతున్నాయని చెప్పారు.
యువ ఉద్యోగుల కోసం కేంద్రప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) పథకాన్ని ప్రకటించిందని గుర్తుచేశారు. ఈ పథకం కింద మొదటిసారి ఉద్యోగంలో చేరే యువతీ యువకులకు ఒక నెల వేతనాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందించనుంది.