న్యూఢిల్లీ : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను (Fuel Prices) తగ్గిస్తుందని గత కొద్దికాలంగా ప్రచారం సాగుతోంది. భగ్గుమంటున్న పెట్రో మంటల నుంచి సామాన్యులకు కాస్త ఉపశమనం కలిగించేందుకు పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు రూ. 10 వరకూ తగ్గిస్తారనే అంచనాలూ ఊపందుకున్నాయి.
సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ సత్తా చాటేందుకు ధరల భారం నుంచి ప్రజలకు ఊరట ఇచ్చేలా కేంద్రం పెట్రో ధరలను తగ్గిస్తుందనే వార్తల నడుమ కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ పూరి స్పందించారు. ఇంధన ధరలపై బుధవారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చమురు ధరల్లో తీవ్ర అనిశ్చితి నెలకొనడంతో రాబోయే రోజుల్లో ఇంధన ధరలను తగ్గించే అవకాశం లేదని మంత్రి తేల్చిచెప్పారు. పెట్రో ధరలు తగ్గుతాయనే వార్తలను ఊహాజనితమైనవని ఆయన తోసిపుచ్చారు.
ఇంధన ధరలను తగ్గించే ఎలాంటి ప్రతిపాదన లేదని మంత్రి పేర్కొన్నారు. ఇంధనాన్ని అందుబాటులో ఉంచేందుకే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఆర్ధిక వ్యవస్ధ వృద్ధికి చమురు వినియోగమే కీలకమని వ్యాఖ్యానించారు. ముడిచమురు ధరలు ఎగబాకినప్పుడు ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీవ్ర నష్టాల్లో కూరకుపోయాయని చెప్పారు. ఇక బ్రెంట్ క్రూడ్ ప్రస్తుతం బ్యారెల్కు 75 డాలర్లు పలుకుతోంది.
Read More :
Zomato | పెట్రోల్ దొరకలేదు.. గుర్రంపై ఫుడ్ డెలివరీ చేసిన జొమాటో బాయ్.. VIDEO