న్యూఢిల్లీ, జనవరి 3: దేశంలో నిరుద్యోగం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నప్పటికీ, తెలంగాణలో మాత్రం నిరుద్యోగిత రేటు తగ్గుతున్నట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా నివేదికలో వెల్లడించింది. గత డిసెంబర్లో దేశంలో నిరుద్యోగిత రేటు నాలుగు నెలల గరిష్ఠానికి (7.91 శాతం) చేరుకొన్నప్పటికీ, తెలంగాణలో మాత్రం నిరుద్యోగిత రేటు కేవలం 2.2 శాతం రికార్డయినట్టు పేర్కొంది. నిరుద్యోగిత రేటు తక్కువగా ఉన్న ఐదు రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నట్టు వివరించింది. 1.4 శాతంతో కర్ణాటక తొలిస్థానంలో ఉండగా, 1.6 శాతంతో గుజరాత్, ఒడిశా రెండో స్థానంలో, 2.1 శాతంతో చండీగఢ్ మూడో స్థానంలో నిలిచింది.
పటిష్ట చర్యలతో తగ్గుముఖం
మే 2020లో కొవిడ్ లాక్డౌన్ సమయంలో తెలంగాణలో నిరుద్యోగిత రేటు 14.7 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో జాతీయ నిరుద్యోగిత రేటు 21.7 శాతంగా రికార్డయ్యింది. అయితే, వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. దీంతో డిసెంబర్ 2021 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 0.4 శాతానికి దిగొచ్చింది. జాతీయ సగటు మాత్రం 7.2 శాతంగా నమోదైంది. అలాగే, డిసెంబర్ 2021 నాటికి తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం రేటు 6.3 శాతానికి దిగిరాగా.. దేశంలో 9.2 శాతంగా నమోదైంది.
ఉపాధికి ఖిల్లా హైదరాబాద్
ఉపాధి కల్పనలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ దేశంలోనే కీలక ప్రాంతంగా ఉన్నది. స్థానికులు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని వారికే కాకుండా ఇతర రాష్ర్టాలకు చెందిన లక్షలాది మందికి నగరం జీవనోపాధిని కల్పిస్తున్నది. కరోనా లాక్డౌన్ విధించినప్పటికీ, తక్కువ నిరుద్యోగిత రేటును కొనసాగించిన రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి అని విశ్లేషకులు చెబుతున్నారు.
ఏడేండ్లలో రెట్టింపు
దేశ ఆర్థిక వ్యవస్థకు తెలంగాణ పెద్ద మొత్తంలో సహకారం అందిస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గతేడాది సెప్టెంబర్లో పేర్కొంది. ఈ మేరకు స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ ఎకానమీ 2020-21 పేరిట హ్యాండ్బుక్ను విడుదల చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థకు సహకారం అందిస్తున్న టాప్ ఐదు రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నదని వెల్లడించింది. 2014-15లో రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు తెలంగాణ నుంచి అందే నెట్ స్టేట్ వ్యాల్యూ యాడెడ్ (ఎన్ఎస్వీఏ) విలువ రూ. 4,16,930 కోట్లు ఉండగా.. కేవలం ఏడేండ్లలోనే (2020-21లో) ఇది రెట్టింపై రూ. 8,10,503 కోట్లకు చేరుకొన్నదని తెలిపింది. వ్యవసాయం ద్వారా రూ. 1.76 లక్షల కోట్లు, రియల్ ఎస్టేట్, గృహ నిర్మాణ రంగం ద్వారా రూ. 1.59 లక్షల కోట్లు, వ్యాపారం, హోటళ్లు, రెస్టారెంట్ల ద్వారా రూ. 1.32 లక్షల కోట్లు ఎన్ఎస్వీఏ రూపంలో రాష్ట్రం నుంచి కేంద్ర ఆర్థిక వ్యవస్థకు చేకూరినట్టు వివరించింది.
దేశ జీడీపీకి చేయూత
దేశ స్థూల దేశీయోత్పత్తికి (జీడీపీ) సహకారం అందిస్తున్న రాష్ర్టాల జాబితాలో తెలంగాణ ఆరో స్థానంలో ఉన్నట్టు గత సెప్టెంబర్లో నీతిఆయోగ్ నివేదిక వెల్లడించింది. 2020-21లో రాష్ట్ర జీడీపీ రూ. 9.80 లక్షల కోట్లుగా ఉన్నదని, 2014-15తో పోలిస్తే ఇది 94 శాతం ఎక్కువ అని పేర్కొంది.