PM Modi | 2014 మేలో నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ అంటే 9 ఏండ్లలో కేంద్రం చేసిన మొత్తం అప్పు అక్షరాలా.. రూ.106,68,113 కోట్లు. అంటే రోజుకు బీజేపీ ప్రభుత్వం రూ. 3,297 కోట్ల చొప్పున అప్పు చేసుకుంటూ పోతున్నది. అలా ఇప్పటివరకూ మొత్తంగా కేంద్రం రూ.1,52,61,122 కోట్ల మేర అప్పు చేసింది. ఏప్రిల్ 1న ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో మరో రూ.15.4 లక్షల కోట్ల రుణాలను సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకొన్నది. ఇందులో భాగంగా తొలిదఫాలో మొదటి ఆరు నెలల్లో రూ.8.88 లక్షల కోట్లను అప్పు చేయాలని నిర్ణయించింది. దీంతో వచ్చే మార్చి నాటికి కేంద్రం మొత్తం అప్పులు రూ.168 లక్షల కోట్లకు చేరనున్నాయి. అంటే దేశంలోని ప్రతీ పౌరుడి నెత్తిన రూ.1.2 లక్షల అప్పు ఉంటుందన్న మాట.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కారు హయాంలో భారత్ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.15.4 లక్షల కోట్ల అప్పులు చేయడానికి నిర్ణయించిన కేంద్రం.. తొలి ఆరు నెలల్లో రూ.8.88 లక్షల కోట్ల రుణ సమీకరణకు నిర్ణయించినట్టు తాజాగా వెల్లడించింది. బాండ్ల ద్వారా ఈ మొత్తాన్ని రాబట్టాలని యోచిస్తున్నట్టు పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.1.2 లక్షల కోట్ల మేర ఎక్కువ అప్పు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి కారణం లేకపోలేదు. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గత ఫిబ్రవరిలో కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో అంకెల గారడీని ప్రదర్శించింది. ఇది భారీ ద్రవ్యలోటుకు దారితీయనున్నట్టు తెలుస్తున్నది. దాన్ని పూడ్చేందుకే గత ఏడాదితో పోలిస్తే, అదనంగా మరో రూ.1.2 లక్షల కోట్ల అప్పుల్ని తీసుకోవాలని కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. ఇటీవలి బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఈ సంకేతాలనే ఇచ్చారు. కొత్తగా సమీకరించే రూ.15.4 లక్షల కోట్ల రుణాల్లో డేటెడ్ సెక్యూరిటీలు, బాండ్ల నుంచి రూ.11.8 లక్షల కోట్లు ఉంటాయని అంచనా. అలాగే చిన్న మొత్తాల పొదుపు, ఇతర మార్గాల నుంచి మరో రూ.3.6 లక్షల కోట్ల నిధులను సేకరించాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తున్నది. కేంద్రం ఇలా అప్పులు చేసుకొంటూ పోతే.. వడ్డీ భారం ఇంకెంత ఉంటుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
గత 67 ఏండ్లలో కేంద్రంలోని గత ప్రభుత్వాలు చేసిన అప్పు రూ.55,87,147 కోట్లు కాగా, మోదీ ప్రధాని అయిన తర్వాత తొమ్మిదేండ్లలో చేసిన అప్పు రూ.106 లక్షల కోట్లకు పైగా ఉన్నది. మరోవైపు, చేసిన అప్పులకు గానూ కేంద్రం పెద్దయెత్తున వడ్డీలు చెల్లిస్తున్నది. 2014-15లో తీసుకొన్న రుణాలకు రూ.4.02 లక్షల కోట్లను వడ్డీగా చెల్లించగా, ఈ ఆర్థిక సంవత్సరం రూ.9.4 లక్షల కోట్లను వడ్డీగా చెల్లించనున్నట్టు సమాచారం. ఈ లెక్కన ప్రతినెల రూ.90 వేల కోట్ల చొప్పున కేంద్రం వడ్డీల రూపంలో చెల్లించనున్నది. అంటే ప్రభుత్వం చేసే ప్రతీ రూపాయి వ్యయంలో అత్యధికంగా 25 పైసలు వడ్డీ చెల్లింపుల కోసమేనని సమాచారం.
ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తుండటంతో ఏటేటా వడ్డీల భారం కేంద్రానికి తలనొప్పిగా మారుతున్నది. దీంతో ఆ భారాన్ని తప్పించుకోడానికి పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచుతూ.. పన్నులను ఎడాపెడా విధిస్తూ బీజేపీ ప్రభుత్వం సామాన్యుల ఉసురు తీస్తున్నది. 2014లో మోదీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి నిత్యావసరాల ధరలు సుమారు 300 శాతం పెరిగినట్టు లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడైంది. ఇంధన ధరల పెరుగుదలతో రవాణా చార్జీలు 30 శాతం వరకు పెరిగినట్టు ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ, ఆ లాభాన్ని వినియోగదారుడికి అందకుండా బీజేపీ సర్కారు తన ఖజానాకు మళ్లించింది. డీజిల్పై , పెట్రోల్పై ఎక్సైజ్ పన్నులను భారీగా పెంచింది.
ఇప్పటివరకూ చేసిన 100 లక్షల కోట్ల అప్పులకు.. వడ్డీలు కట్టాల్సి ఉంది. అందుకే, కేంద్రం కొత్తగా అప్పు చేస్తున్నట్టు కనిపిస్తున్నది. జాతి ప్రయోజనాలను నిజంగా బీజేపీ ప్రభుత్వం కాపాడాలనుకొంటే.. ఎన్నికల్లో ఉచిత హామీలను కట్టిపెట్టాలి. అప్పుడే సామాన్యులపై పన్నుల భారం పడదు.
-రవికృష్ణ, న్యాయవాది హైదరాబాద్
చదువుకునే విద్యార్థుల స్కాలర్షిప్లను కేంద్రం రద్దు చేసింది. సీనియర్ సిటిజెన్లకు రాయితీలు ఎత్తేసింది. అలాగే, కార్పొరేట్ల రుణాలను కూడా రైటాఫ్ చేసింది. అంటే, సామాన్యులు, విద్యార్థుల గోస పట్టించుకోని బీజేపీ సర్కారు కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నట్టు అర్థమవుతున్నది.
– కరుణకుమార్, స్కాలర్, సిద్దిపేట