జైపూర్: రాజస్థాన్లో (Rajasthan) ఎన్నికల ఫలితాలు వెలువడి ఐదు రోజులవుతున్నది. రాష్ట్రంలో బీజేపీ (BJP) స్పష్టమైన మెజార్టీ వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి (CM) ఎవరనే అంశంపై ఇంకా సందిగ్ధత (Uncertainty) కొనసాగుతున్నది. రాజస్థాన్ యోగిగా పేరొందిన ఆల్వార్ ఎంపీ బాబా బాలక్నాథ్, రాజ్పుత్ వర్గానికి చెందిన దియా కుమారి, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఐదు రోజులైనా పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేకపోతున్నది. దీంతో ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే (Vasundhara Raje) దేశరాధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పటికే ఆమె పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అపాయింట్మెంట్ కోరారని, గురువారం ఉదయం ఆయనతో సమావేశం కానున్నారని తెలుస్తున్నది. ఈ సందర్భంగా సీఎం పదవి విషయం గురించే చర్చించే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 60 మందికిపైగా శాసనసభ్యులు సోమ, మంగళవారాల్లో ఆమెతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిగా తమ మద్దతు ప్రకటించినట్లు మీడియావర్గాలు తెలిపాయి. అయితే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వారితో చెప్పినట్లు వెల్లడించాయి. ఇప్పటికే ఆమె ఇప్పటికే రెండు పర్యాయాలు సీఎంగా పనిచేశారు. 2003 నుంచి 2008 వరకు, 2013 నుంచి 18 వరకు రెండుసార్లు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఆమెను మరోసారి సీఎంగా చేసేందుకు పార్టీ అధిష్ఠానం సుముఖంగా లేదని రాజకీయ వర్గాలు బెబుతున్నాయి.