Uma Bharti | మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మద్యం పాలసీలో మార్పులు తీసుకురావాలని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి డిమాండ్ చేస్తున్నారు. మద్యం పాలసీలో మార్పులు తెస్తేనే మళ్లీ రికార్డు స్థాయి విజయం సొంతం చేసుకుంటామని, లేదంటే అంతే సంగతులని ముఖ్యమంత్రి చౌహాన్ను హెచ్చరిస్తున్నారు. రెండు రోజుల్లోగా ఆ వార్త వినేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె తీవ్ర స్వరంతో చెప్పారు.
ఉమా భారతి ఆదివారం భోపాల్లోని అయోధ్య బైపాస్ రోడ్డులో ఉన్న హనుమాన్ దేవాలయానికి వచ్చారు. అక్కడ మీడియాతో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో మద్యం పాలసీ సరిగా లేదని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మద్యం పాలసీని మార్చాల్సిందే అని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఆలయంలో ఈ నెల 31 వరకు ఉంటానని, అంతలోపు మంచి వార్త వినేలా సీఎం చౌహాన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందన్నారు. డీ-అడిక్షన్ను ప్రోత్సహించేలా కొత్త మద్యం పాలసీని మార్చాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. కొత్త మద్యం పాలసీ ప్రకటించే వరకు ఇక్కడే ఉంటానని చెప్పారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఈ ఏడాదిలో ఎన్నికలు జరుగనున్నాయి. 2003 లో మద్యం పాలసీలో మార్పులు తీసుకురావడం వల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో 170 స్థానాల్లో రికార్డు విజయం సాధించామని ఉమా భారతి గుర్తుచేస్తున్నారు. అందుకే మధ్యప్రదేశ్లో నియంత్రిత మద్యం విధానాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు. సంపూర్ణ మద్య నిషేధం విధించాలని తానెప్పుడూ కోరలేదని చెప్పిన ఉమా భారతి.. సీఎం చౌహాన్ నియంత్రిత మద్యం పాలసీ తీసుకువస్తారన్న నమ్మకం ఉన్నదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ కచ్చితమైన మద్యం పాలసీని తీసుకువస్తేనే ఇక్కడ మళ్లీ ఆ పార్టీనే ప్రజలు గెలిపించి అధికారంలో కూర్చోబెడతారని పేర్కొన్నారు.