ముంబై, జూన్ 13: మహారాష్ట్రలో శివసేన సారథ్యంలోని మహావికాస్ అఘాదీ ప్రభుత్వం ఐదేండ్లపాటు కొనసాగడం కష్టమేనన్న వార్తలు వినిపిస్తున్నాయి. రెండున్నరేండ్ల పాటు పదవి నిర్వహించిన తర్వాత ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను మార్చనున్నారని వదంతులు వ్యాపిస్తున్నాయి. ఇటీవల సీఎం ఠాక్రే ప్రధాని మోదీతో ఏకాంతంగా సమావేశం కావడం అనేక ఊహాగానాలకు తావిచ్చింది. శివసేన మళ్లీ బీజేపీకి చేరువకానుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2019 అక్టోబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీచేశాయి. అయితే సీఎం పదవి విషయంలో పేచీ రావడంతో కూటమికి బీటలువారాయి. దీంతో ఊహించని విధంగా శివసేన.. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. సీఎంగా ఉద్ధవ్ బాధ్యతలు చేపట్టారు. రెండున్నరేండ్ల తర్వాత పదవి నుంచి ఉద్ధవ్ను తప్పిస్తారన్న వార్తలు అవాస్తమని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ కొట్టివేశారు. సీఎం పదవి ఐదేండ్లూ శివసేన దగ్గరే ఉంటుందని, పదవిపై బేరసారాలు లేవని తెలిపారు.
‘మహా వికాస్ అఘాదీ ప్రభుత్వం ఐదేండ్ల పాటు కొనసాగుతుంది. ప్రధాని మోదీతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రత్యేకంగా సమావేశం కావడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదు’ అని ఎన్సీపీ నేత జయంత్పాటిల్ స్పష్టంచేశారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ఈ ఊహాగానాలను కొట్టివేశారు. ప్రభుత్వం పూర్తికాలం పాలన సాగిస్తుందని చెప్పారు. శివసేన విశ్వసనీయ పార్టీ అని ప్రశంసించారు. వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లోనూ తమ కూటమి మెరుగైన ఫలితాలు సాధిస్తుందని పేర్కొన్నారు. కాగా, శనివారం పార్టీ నేతలతో సమావేశం సందర్భంగా శివసేన నేత సంజయ్ రౌత్ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత సంకీర్ణ ప్రభుత్వంలో శివసేనను బీజేపీ బానిసలా చూసిందని, పార్టీని పూర్తిగా నాశనం చేయాలని కుట్ర పన్నిందని ఆరోపించారు. శివసేన మద్దతుతో ప్రభుత్వాన్ని నడుపుతూ తమను ద్వితీయశ్రేణి పౌరులుగా చూసిందని మండిపడ్డారు.