ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీలో మరాఠా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడాన్ని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే స్వాగతించారు. మరాఠా రిజర్వేషన్ల కోసం త్యాగాలు చేసిన మరాఠాలను ఆయన అభినందించారు. సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును పరిశీలించిన తర్వాత ఇది అసెంబ్లీలో ఆమోదం పొందినా కోర్టులో పెండింగ్లోనే ఉందని వ్యాఖ్యానించారు.
విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించే మరాఠా కోటా బిల్లు ఆమోదం పొందినందుకు తాను ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని ఠాక్రే పేర్కొన్నారు. మరాఠా కోటా కోరుతూ నిరసన చేపట్టిన అంతర్వాలి గ్రామంలో లాఠీచార్జ్ చేశారని దీని గురించి తాను ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని అన్నారు.
ఉద్యోగాలు, విద్యా సంస్ధల్లో ఈ రిజర్వేషన్ అమలవుతుందని అన్నారు. ప్రభుత్వానికి మరాఠా కోటా విషయంలో తాము మద్దతిస్తామని, అయితే కోటా కింద ఎంతమందికి ఉద్యోగాలు లభించాయనేది ప్రభుత్వం వెల్లడించాలని అన్నారు. ఈ దిశగా కొంత సమయం వరకూ తాము వేచిఉండాల్సిన అవసరం ఉందని శివసేన (యూబీటీ) చీఫ్ ఠాక్రే వ్యాఖ్యానించారు.
Read More :