Uddhav Thackeray : ఢిల్లీలో విపక్ష ఇండియా కూటమి నిర్వహించిన మెగా ర్యాలీలో మోదీ సర్కార్ లక్ష్యంగా విపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమమని, విపక్ష నేతలపై దాడులతో కాషాయ పాలకులు ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారని మండిపడ్డారు. ఈ ర్యాలీలో మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ బీజేపీ రానున్న లోక్సభ ఎన్నికల్లో 400 స్ధానాలు గెలుచుకోవాలని కలలు కంటోందని, ఒక పార్టీ, ఒక వ్యక్తి సారధ్యంలో నడిచే ప్రభుత్వం అధికారం కోల్పోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
తాము ఇక్కడ ఎన్నికల ప్రచారం చేసేందుకు రాలేదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఏకమయ్యామని చెప్పారు. గతంలో అవినీతిలో కూరుకుపోయిన వారిని బీజేపీ వాషింగ్ మెషీన్లో శుభ్రం చేసి పునీతులను చేస్తోందని ఎద్దేవా చేశారు. అవినీతిపరులతో నిండిపోయిన పార్టీ ప్రభుత్వాన్ని ఎలా నడుపుతుందని ప్రశ్నించారు.ఇంకా ఈ ర్యాలీలో కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ తన భర్త అరవింద్ కేజ్రీవాల్ను మన ప్రధాని నరేంద్ర మోదీ జైలులో పెట్టారని ప్రధాని నిర్ణయం సరైనదేనా అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ నిజమైన దేశ భక్తుడని, నిజాయితీపరుడని మీరు నమ్ముతున్నారా అని ప్రజలను అడిగారు. జైలుపాలైన కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు కోరుతున్నారని, ఆయన రాజీనామా చేయాలా అని ర్యాలీకి హాజరైన ప్రజలను ఆమె ప్రశ్నించారు.
మీ కేజ్రీవాల్ సింహం లాంటి వాడని, ఆయనను ఎంతోకాలం కాషాయ పాలకులు జైల్లో బంధించలేరని సునీతా కేజ్రీవాల్ అన్నారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీల్యాండరింగ్ కేసులో కేజ్రీవాల్ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్కు సంఘీభావంగా చేపట్టిన ఈ ర్యాలీకి పెద్దసంఖ్యలో భాగస్వామ్య పార్టీల నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. దేశ రాజధానిలోని రాంలీలా మైదాన్లో ఈ జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తదితులు పాల్గొన్నారు.
Read More :
Vastu Shastra | గేటెడ్ కమ్యూనిటీలో కాంపౌండ్లు లేని ఇల్లు కొనవచ్చా?