ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తన పదవికి రాజీనామా చేశారు. రేపు అసెంబ్లీలో జరిగే బల పరీక్షకు ముందే ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వాన్ని అసెంబ్లీలో బల పరీక్ష నిర్వహించుకోవాలని గవర్నర్ ఆదేశించడాన్ని సవాల్ చేస్తూ శివసేన చీఫ్విప్ సునీల్ ప్రభు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ గవర్నర్ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. బల పరీక్షపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. శివసేన రెండు వర్గాలుగా చీలిపోయింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు మెజారిటీ ఉండడంతో ఉద్ధవ్ రాజీనామా చేశారు.
అంతకు ముందు ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్కు కృతజ్ఞతలు తెలిపారు. బాలాసాహెబ్ ఆశయాలను నెరవేర్చామన్నారు. మా ప్రభుత్వానికి కొందరి దిష్టి తగిలిందని, ఆ దిష్టి ఎవరో అందరికీ తెలుసునన్నారు. సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తున్నామన్నారు. కేబినెట్ భేటీలో ఔరంగాబాద్ పేరును మార్చామన్నారు. రెబెల్ ఎమ్మెల్యేలు తమతో మాట్లాడి ఉండాల్సిందని, మా పార్టీ వాళ్లే మమ్మల్ని మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.