ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. ముంబైలోని ప్రముఖ శివాజీ పార్కులో దసరా వేడుకల సభ కోసం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు అనుమతి ఇచ్చింది. బీజేపీ కుట్ర వల్ల శివసేన రెండు వర్గాలుగా చీలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివాజీ పార్క్లో దసరా వేడుకలు నిర్వహించేందుకు ఉద్ధవ్ ఠాక్రే, షిండే వర్గాలు పోటీ పడ్డాయి. అయితే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) శాంతిభద్రతల సమస్య పేరుతో ఈ రెండు వర్గాలకు అనుమతి నిరాకరించింది. దీంతో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన దీనిపై బాంబే హైకోర్టును ఆశ్రయించింది.
మరోవైపు షిండే వర్గానికి చెందిన దాదర్ ఎమ్మెల్యే సదా సర్వాంకర్ కూడా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. శివసేన మెజార్టీ వర్గం షిండే నేతృత్వంలో ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ ఎవరికి చెందుతుందో అన్నది తేలే వరకు ఉద్ధవ్ ఠాక్రే వర్గం పిటిషన్పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోర్టును కోరారు. అయితే ఈ అభ్యర్థనను బాంబే హైకోర్టు తిరస్కరించింది. శివాజీ పార్కులో దసరా సభకు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు అనుమతి ఇచ్చింది.
కాగా, శివసేన పార్టీ ఆవిర్భవించిన 1966 నుంచి ప్రతి ఏటా ముంబైలోని శివాజీ మహారాజ్ పార్క్లో దసరా వేడుకలను శివసేన నిర్వహిస్తున్నది. అయితే కరోనా వల్ల గత రెండేళ్లుగా దసరా ఉత్సవాలు జరుగలేదు. మరోవైపు శివసేనలో చీలిక వల్ల ఈ ఏడాది శివాజీ పార్క్లో దసరా బహిరంగ సభ నిర్వాహణకు రెండు వర్గాలు పోటీ పడ్డాయి. అయితే ఉద్ధవ్ ఠాక్రేకు అనుకూలంగా బాంబే హైకోర్టు స్పందించింది. మరోవైపు సీఎం షిండే నేతృత్వంలోని శివసేన రెబల్ వర్గం బాంద్రా కుర్లా కాంప్లెక్స్ గ్రౌండ్లో దసరా వేడుకలకు ఇప్పటికే బీఎంసీ నుంచి అనుమతి పొందింది.