Uddhav Thackeray | ఖేడ్, మార్చి 5: మేఘాలయలో ఇప్పుడు ఎవరి బూట్లు ఎవరు నాకుతున్నారని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే బీజేపీని సూటిగా ప్రశ్నించారు. శివసేన పార్టీ పేరును, గుర్తును కోల్పోయిన తర్వాత ప్రస్తుత రాజకీయాలపై స్పందిస్తూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలోని ఖేడ్ పట్టణంలో ఆదివారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘సీఎం కావడం కోసం నేను ఎన్సీపీ, కాంగ్రెస్ బూట్లు నాకానని పుణెలో అమిత్ షా వ్యాఖ్యానించారు. ఇప్పుడు వాళ్లు మేఘాలయాలో ఏం చేస్తున్నారు? సిగ్గు అనిపించడం లేదా?’ అని ప్రశ్నించారు. ‘గో మూత్రం చల్లడం వల్ల మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందా?.. కాదు.. స్వాతంత్య్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పిస్తే మనకు స్వాతంత్య్రం వచ్చింది’ అని అన్నారు. సర్దార్ పటేల్, సుభాష్ చంద్ర బోస్ పేర్లను దొంగిలించినట్లే తన తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే పేరును కూడా బీజేపీ దొంగిలించిందని తీవ్రస్థాయిలో విమర్శించారు.
‘పటేల్ ఆర్ఎస్ఎస్ను నిషేధించారు. కానీ ఆయన పేరునే వారు దొంగిలించారు. అదే విధంగా సుభాష్ చంద్రబోస్, బాలాసాహెబ్ ఠాక్రే పేర్లను కూడా వాళ్లు దొంగిలించారు. వాళ్లు శివసేన పేరు, బాలాసాహెబ్ ఫొటోతో కాకుండా మోదీ పేరుతో ఓట్లు అడగాలని నేను సవాల్ విసురుతున్నా’ అని ఉద్ధవ్ అన్నారు. శివసేన పేరు, పార్టీ గుర్తులను తమకు కాకుండా చేసిన ఎన్నికల సంఘంపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ‘మహారాష్ట్ర నా కుటుంబం. కుటుంబాన్ని మార్చే వాళ్లు మీ బాగోగులు ఎలా పట్టించుకుంటారు. ఎన్నికల సంఘం కాటారాక్ట్ సమస్యతో బాధ పడకుండా ఉన్నట్టయితే క్షేత్ర స్థాయి పరిస్థితి ఏమిటో చూడాలి. ఈసీ ‘సున్నం పెట్టే’ కమిషన్. అది అధికారంలో ఉన్నవారికి బానిస. ఈసీ తీసుకున్న నిర్ణయం తప్పు. మీరు(ఈసీ) మా నుంచి పార్టీ పేరు, గుర్తు లాగేసుకున్నారు. కానీ శివసేనను నా నుంచి లాగేసుకోలేరు’ అని ఉద్ధవ్ స్పష్టం చేశారు.