ముంబై : సీఎం పదవి నుంచి వైదొలిగిన తర్వాత తొలిసారిగా ఉద్ధవ్ థాకరే తన మద్దతుదారులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. మహారాష్ట్రలో తక్షణమే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. శివసేన పార్టీ సింబల్ను రెబెల్స్ ఉపయోగించుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
ఇవాళే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని అధికారంలో ఉన్న నాయకులకు సవాల్ విసురుతున్నానని థాకరే పేర్కొన్నారు. ఒక వేళ తాము తప్పు చేస్తే ప్రజలు తమను ఇంటికి పంపిస్తారు. ఒక వేళ వారు తప్పు చేస్తే వారిని ఇంటికి పంపించేస్తారని పేర్కొన్నారు. ఇక శివసేన నుంచి పార్టీ గుర్తును రెబెల్స్ తీసుకోలేరని చెప్పారు. ఏదేమైనప్పటికీ ప్రజలు సింబల్ను చూడరని, నాయకుల వ్యక్తిత్వాన్ని చూస్తారని తెలిపారు. గత రెండున్నరేండ్ల నుంచి తనను, తన కుటుంబాన్ని బీజేపీ టార్గెట్ చేసినప్పుడు.. ఇప్పటి రెబెల్స్ సైలెంట్గా ఉన్నారని ఉద్ధవ్ థాకరే గుర్తు చేశారు. శివసేనలో ఉంటూ సొంత పార్టీ నాయకులకు ద్రోహం చేస్తారని ఊహించలేదని థాకరే అన్నారు.
బెదిరింపులు వచ్చినా తనతో ఉన్న 16 మంది ఎమ్మెల్యేలను చూసి గర్వపడుతున్నాను. రెబెల్స్ టూర్కు వెళ్లకుండా తనతో వచ్చి మాట్లాడి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. తన కుటుంబాన్ని దుర్భషలాడిన వారితో ఉన్నవారు తనకు అవసరం లేదన్నారు. ఏక్నాథ్ షిండేకు మద్దతుగా వెళ్లిన వారిలో తనను గౌరవించే వారు ఉన్నారో లేదో మీరే నిర్ణయించుకోవాలని రెబెల్స్ను ఉద్దేశించి థాకరే అన్నారు.
శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఏక్నాథ్ షిండేను ఆహ్వానించాలన్న గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై కూడా సోమవారం విచారణ జరగనుంది. అయితే శివసేన భవిష్యత్తో పాటు భారత ప్రజాస్వామ్య భవిష్యత్ను కూడా సుప్రీంకోర్టు ఆ రోజు నిర్ణయిస్తుందని ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు.