చెన్నై: ఉమ్మడి పౌరస్మృతిని (యూసీసీ) అమలుచేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది దేశ బహుళ సాంస్కృతిక నిర్మాణానికి పెనుముప్పుగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ లౌకిక దేశమని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 మైనార్టీల హక్కులకు రక్షణ కల్పిస్తున్నదని చెప్పారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు, ఉనికిపై యూసీసీ తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. దేశంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక అంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా యూసీసీ అమలుకు యత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మతాల మధ్య విభజనకు, సామాజిక అలజడులకు ఇది కారణమవుతుందని చెప్పారు. వివిధ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్య స్థితిగతులు వేర్వేరుగా ఉంటాయని, అందరినీ ఒకేగాటిన కడుతూ యూసీసీ అమలుచేయడం సరికాదన్నారు. ఈ మేరకు లా కమిషన్ చైర్పర్సన్కు ఆయన గురువారం లేఖ రాశారు.