శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. దక్షిణ కశ్మీర్లోని పుల్వామా టౌన్లో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తొయితా కమాండర్ సహా మరో ఇద్దరు గుర్తుతెలియని టెర్రరిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామాలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బుధవారం తెల్లవారుజామున కశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా గాలింపు బృందాలపై ముష్కరులు కాల్పులు జరిపారని, ఈ సందర్భంగా వారిని లొంగిపోవాలని కోరామని కశ్మీర్ పోలీసులు తెలిపారు. అయినప్పటికీ వినకుండా భద్రతా దళాలపై కాల్పులు జరిపారని, ప్రతిగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు. వారిలో లష్కరే తొయిబా కమాండర్ ఐజాజ్ ఉన్నాడని తెలిపారు. మరో ఇద్దరు స్థానికులని, వారు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారనే విషయం తెలియాల్సి ఉందని వెల్లడించారు. ఆ ప్రాంతంలో టెర్రరిస్టుల కోసం ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు.